వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ ప్రతిభావంతుడైన నటుడిగా పేరు తెచ్చుకున్నారు ప్రియదర్శి. ఆయన ప్రధాన పాత్రలో నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘బలగం’. కావ్య కళ్యాణ్రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ ఇతర క్యారెక్టర్స్లో కనిపించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు. వేణు యెల్దండి దర్శకత్వం వహించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించిన నేపథ్యంలో ప్రియదర్శి తాజా ఇంటర్వ్యూలో తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ప్రేక్షకులను కదిలించింది
నా సన్నిహితులు ‘బలగం’ సినిమా చూసి ‘మల్లేశం’ చిత్రం తర్వాత మరోసారి మంచి సినిమాలో నటించావని ప్రశంసిస్తున్నారు. చాలా మంది ప్రేక్షకులు ఈ సినిమాను రెండు మూడు సార్లు చూస్తున్నారు. గొప్ప సినిమా అని చెబుతున్నారు. థియేటర్లో కంటతడి పెట్టినా సంతోషంగా బయటకు వస్తున్నారు. సినిమా చూస్తూ తమ జీవితంలో జరిగిన సంఘటనలు గుర్తు తెచ్చుకున్నామని చెబుతుంటే ఆనందంగా ఉంది. వేమన పద్యాలు విన్నప్పుడు మనసులో మంచి చేయాలనే ఆలోచన పుడుతుంది. ఈ సినిమా చూసిన తర్వాత అలాంటి పాజిటివ్ ఆలోచనలు వస్తుంటాయి. తమని కదిలించిన చిత్రమిదని ప్రేక్షకులు అంటున్నారు.
కామెడీ కథ అనుకున్నా
దర్శకుడు వేణు కమెడియన్ కాబట్టి ఏదో కామెడీ కథను నా దగ్గరకు తీసుకొచ్చాడు అనుకున్నా. కానీ కుటుంబంలోని అనుబంధాలు, భావోద్వేగాలతో ఇంత మంచి కథ రాస్తాడని ఊహించలేదు. ఆయన ప్రతిభావంతుడని అర్థమైంది. ఈ సినిమాలో ఆస్వాదిస్తూ నటించాను. ఇందులో బుడగ జంగం పాట చేర్చిన తర్వాత సినిమా మరింత హృద్యంగా తయారైంది. ఇందులోని నటీనటులందరూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఇలాంటి చిత్రాల్లో నటించే అవకాశం అరుదుగా వస్తుంటుంది. ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలు కూడా మా చిత్రాన్ని అభినందిస్తున్నారు. నేను ఇందులో భాగమైనందుకు గర్వపడుతున్నాను. ఇలాంటి కథను దిల్రాజు గారి బ్యానర్లో నిర్మించడం వల్ల విస్తృతంగా జనాలకు చేరువైంది.
విభిన్నమైన కథల్లో
ప్రస్తుతం నేను వైవిధ్యమైన కథల్లో నటిస్తున్నాను. దర్శకుడు మహీ వి రాఘవ్ రూపొందిస్తున్న ‘సేవ్ ద టైగర్స్’ అనే వెబ్ సిరీస్లో నటిస్తున్నాను. ఇది కొత్త కాన్సెప్ట్తో సాగే పూర్తి వినోదాత్మక సినిమా. క్రైమ్ డ్రామా ‘సుయోధన’లో నటిస్తున్నాను. ‘శఠగోపం’, నాని 30 వంటి చిత్రాలు ఒప్పుకున్నా.