మలయాళ అగ్ర హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ షూటింగ్లో గాయపడిన విషయం తెలిసిందే. తన తాజా చిత్రం ‘విలాయత్ బుద్ధ’లో యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగా ప్రమాదవశాత్తు బస్సుపై నుంచి పడటంతో పృథ్వీరాజ్ సుకుమారన్ గాయపడ్డారు. దాంతో ఆయన్ని కొచ్చిలోని ఓ ఆసుపత్రికి తరలించారు. మంగళవారం పృథ్వీరాజ్కు వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు.
ఈ సందర్భంగా తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేస్తూ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు పృథ్వీరాజ్ సుకుమారన్. ‘సుశిక్షితులైన వైద్య బృందం సమక్షంలో విజయవంతంగా ఆపరేషన్ పూర్తయింది. కొన్ని నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. మీ అందరి దీవెనలతో త్వరగా కోలుకుంటాననే నమ్మకం ఉంది’ అని పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ప్రభాస్ ‘సలార్’ చిత్రంలో కీలక పాత్రను పోషిస్తున్నారు.