ప్రస్తుతం సినీ పరిశ్రమలో కథల కంటే కాంబినేషన్స్కు ప్రాముఖ్యత పెరిగిందన్నారు నిర్మాత సి.కల్యాణ్. మంచి సినిమా తీయడం కంటే హిట్స్ ఉన్న హీరోలు-దర్శకుల కాంబినేషన్స్ను కుదర్చడంపైనే నిర్మాతలు దృష్టిపెడుతుండటం బాధాకరమని పేర్కొన్నారాయన. సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించారు సి.కల్యాణ్. నేడు ఆయన జన్మదినం. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్లో సి.కల్యాణ్ పాత్రికేయులతో ముచ్చటిస్తూ ‘సినీ పరిశ్రమ చిన్నదే అయినా కోట్లాది మంది ప్రజల్ని ప్రభావితం చేసే శక్తి ఈ రంగానికి ఉంది. ప్రజలకు మేలు చేయాలనే ఆలోచనతో టికెట్ రేట్లు తగ్గించాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోతున్నది. సినీ రంగాన్ని చంపొద్దని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని అమలు చేయమని ఏపీ ప్రభుత్వాన్ని ఇండస్ట్రీ పెద్దలు కోరారు. దీనిపై ప్రభుత్వంతో సినీ ప్రముఖులు జరిపిన చర్చలను కొందరు వక్రీకరించడం అపార్థాలకు దారితీసింది. ప్రస్తుతం కలెక్షన్స్, కాంబినేషన్స్కు మాత్రమే ఇండస్ట్రీలో విలువ ఉంటున్నది. సినిమా రూపకల్పన విషయంలో నిర్మాతలకు సరైన అవగాహన ఉండటం లేదు. సత్యదేవ్ హీరోగా మా సంస్థలో రూపొందుతున్న ‘గాడ్సే’ సినిమా చిత్రీకరణ తుదిదశకు చేరుకున్నది. రానా హీరోగా నటిస్తున్న ‘1945’ చిత్రాన్ని ఈ నెల 31న విడుదలచేయనున్నాం. బాలకృష్ణతో మళ్లీ సినిమా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఆయన కలల ప్రాజెక్ట్ ‘రామానుజాచార్య’ను మా బ్యానర్లో చేయాలన్నది నా కోరిక. చెన్నైలో కల్యాణ్ ఎమ్యూజ్మెంట్ పార్క్ను నిర్మిస్తున్నా’ అని తెలిపారు.