కిరణ్, అక్సఖాన్, అలేఖ్యరెడ్డి ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న సందేశాత్మక యాక్షన్ చిత్రం ‘దీక్ష’. డా.ప్రతాని రామకృష్ణగౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి రెండోవారంలో థియేట్రికల్ రిలీజ్ రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ ‘ అన్ని వార్గాలకూ నచ్చే సినిమా ఇది. పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం తథ్యం అనే సందేశంతో ఈ సినిమా రూపొందింది.
ప్రేమ, యాక్షన్, ఎమోషన్.. ఇలా అన్ని అంశాలూ ఈ సినిమాలో ఉంటాయి. ఇందులోని పాటలకు ప్రేక్షకుల్లో మంచి స్పందన వస్తున్నది. పనిచేసిన అందరికీ మంచి పేరు తెచ్చే సినిమా ఇది.’ అని నమ్మకం వెలిబుచ్చారు. ఈ సినిమాలో భాగం కావడం పట్ల హీరోహీరోయిన్లు కిరణ్, అక్సఖాన్, అలేఖ్యరెడ్డి ఆనందం వెలిబుచ్చారు. ఇంకా నటి తులసి, చిత్ర సమర్పకుడు డి.ఎస్.రెడ్డి కూడా మాట్లాడారు.