Hanuman | టాలీవుడ్లో లేటెస్ట్ సెన్సేషనల్ హనుమాన్. తేజా సజ్జా ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా టాలీవుడ్లో రికార్డులు సృష్టించింది. పెద్ద హీరోల సినిమాలకు పోటీగా సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా.. ఇప్పటికే 250 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఈ సినిమా రిలీజై 15 రోజులు దాటుతున్నా ఇంకా థియేటర్లు హౌస్ఫుల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికీ ఈ సినిమా చూడని చాలామంది ఓటీటీలో రిలీజైతే చూద్దామని అనుకుంటున్నారు. కానీ అలాంటి వాళ్లకు ఓ బ్యాడ్ న్యూస్! హనుమాన్ సినిమా ఇప్పుడే ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
సాధారణంగా ఈ మధ్య రిలీజైన చాలా సినిమాలు నాలుగు వారాలు కాగానే ఓటీటీలోకి వచ్చేశాయి. ప్రభాస్ హీరోగా వచ్చిన సలార్ సినిమా కూడా కేవలం 28 రోజుల్లోనే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ లెక్కన జనవరి 12న రిలీజైన హనుమాన్ సినిమా ఫిబ్రవరి 9 లేదా 10వ తేదీ వరకు ఓటీటీలోకి వచ్చేస్తుందని అనుకున్నారు. కానీ హనుమాన్ సినిమాకు థియేటర్లో వస్తున్న రెస్పాన్స్ చూసిన చిత్ర యూనిట్.. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.
హనుమాన్ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకుంది. ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం ఈ సినిమాను థియేటర్లో రిలీజైన 5 నుంచి 6 వారాల్లో ఓటీటీలోకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ థియేటర్లో వస్తున్న రెస్పాన్స్ చూసి ఈ సినిమా స్ట్రీమింగ్ను వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. మార్చి రెండో వారంలో ఈ సినిమా స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. మార్చి 8వ తేదీ శివరాత్రి ఉండటంతో హనుమాన్ సినిమాను ఆ రోజే ఓటీటీలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అదే నిజమైతే హనుమాన్ సినిమాను ఓటీటీలో చూడాలని వెయిట్ చేస్తున్న అభిమానులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి!