Hanuman Movie | టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ప్రశాంత్వర్మ (Prashanth Varma) దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘హనుమాన్’. తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తుంది. ఇప్పటివరకు ఈ చిత్రం వరల్డ్వైడ్గా రూ.250 కోట్లుకు పైగా వసూళ్లు రాబట్టింది. ఇదిలావుంటే ఈ సినిమా ముగింపులో సీక్వెల్ ఉంటుందని ప్రశాంత్ వర్మ ప్రకటించిన విషయం తెలిసిందే. ‘రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి?’ అన్న స్టోరీతో ‘జై హనుమాన్’ సినిమా రానుంది.
అయితే ఈ సినిమాలో హనుమంతుడిగా కనిపించబోయేది ఎవరంటూ అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో మొదట హనుమంతుడిగా టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి కనిపించబోతున్నట్లు.. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో కనిపించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యులో పాల్గొన్న దర్శకుడు ప్రశాంత్ వర్మ హనుమాన్, రాముడి పాత్రలను ఎవరు చేస్తే బాగుంటుందో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
‘జై హనుమాన్’ (Jai Hanuman) మూవీ కథ పరంగా చాలా పెద్దది. ఇందులో హనుమంతుడి రోల్ ఎవరు చేసినా హావభావాలు వ్యక్తపరచడంలో ఎలాంటి ఇబ్బంది కనిపించదు. ఆంజనేయస్వామికి అష్ట సిద్ధులు తెలుసు. కాబట్టి, ఆయన ఏ రూపంలోనైనా కనిపిస్తారు. ఆ శక్తులను వివరంగానే చూపిస్తాం. ‘జై హనుమాన్’లో హనుమంతుడి రోల్ పోషించడానికి చాలా మంది బాలీవుడ్ నటులు ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. అయితే ఆన్స్క్రీన్తో పాటు, ఆఫ్ స్క్రీన్లోనూ కూడా హనుమాన్ పాత్ర చేసేవారిని చూడగానే మనకు ఒక ఆధ్యాత్మిక భావన కలగాలి. అలా చూస్తే.. మెగాస్టార్ చిరంజీవి గారు ఈ పాత్రకు సరిపోవచ్చు. ‘పద్మవిభూషణ్ వచ్చిన తర్వాత చిరంజీవిని కలవలేదు. మెగాస్టార్ ఇంటివద్ద చాలా కోలాహలంగా ఉంది. అంత సర్దుకున్నాక వెళ్లి చిరంజీవిని కలుసుకుని జై హనుమాన్ గురించి చెబుతా. అన్నీ కుదిరితే చిరంజీవిగారే ఆ పాత్ర చేసే అవకాశం కూడా ఉండొచ్చు. ఇక రాముడి పాత్రలో నాకు మొదటినుంచి నా మదిలో ఉన్న నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబు. సోషల్మీడియాలో ఆయనను రాముడిగా క్రియేట్ చేసిన ఫొటోలను చూశా.. చాలా బాగా నచ్చాయి. దీని గురించి కూడా మహేష్తో చర్చిస్తాం. ఇక ఈ సినిమాలో సమంత హీరోయిన్గా నటించనుంది అని వస్తున్న వార్తలు అబద్దం అంటూ ప్రశాంత్ వర్మ వెల్లడించాడు.
ఇక ‘హనుమాన్’కు సీక్వెల్గా వస్తున్న ‘జై హనుమాన్ కు సంబంధించి ఇప్పటికే స్క్రిప్ట్ కూడా సిద్ధమయిపోయిందని ప్రశాంత్ వర్మ వెల్లడించాడు. దీంతో ప్రేక్షకులంతా సెకండ్ పార్ట్ ‘జై హనుమాన్’ కోసం ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా 2025లో ప్రేక్షకుల ముందుకు రానుంది.