Prakash raj Comments on Dhurandhar 2 | రణ్వీర్ సింగ్ కథానాయకుడిగా, ఆదిత్య ధార్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్ 2’ (Dhurandhar: The Revenge) చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న విషయం తెలిసిందే. మొదటి భాగం సృష్టించిన ఇంపాక్ట్తో, సీక్వెల్ కోసం ప్రేక్షకులు థియేటర్ల వద్ద బారులు తీరుతున్నారు. కేవలం ఓపెనింగ్ డే రోజే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టి, ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరిచింది. అయితే ఈ సినిమాకు ఒకవైపు భారీ రెస్పాన్స్ వస్తుంటే, మరోవైపు ఇది రాజకీయ ప్రచార చిత్రం (Propaganda Film) అనే విమర్శలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ టాప్ హీరోలు అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, మరియు విజయ్ దేవరకొండ ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్లు పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంది.
అయితే ఈ సినిమాపై వస్తున్న ప్రశంసలు వెనుక రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. అయితే ఇదే విషయంపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఎక్స్ వేదికగా స్పందించాడు. ఉత్తరాదిలో తరచుగా వినిపించే “ఒత్తిడి రాజకీయాలు” ఇప్పుడు టాలీవుడ్లోకి కూడా ప్రవేశించాయని, అధికార పార్టీకి అనుకూలంగా ఉండే సినిమాలను ప్రమోట్ చేయాల్సిన పరిస్థితి స్టార్ హీరోలకు వచ్చిందని ఆయన పరోక్షంగా బీజేపీని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.