Pradeep Ranganathan | తమిళ యువ నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ వరుస విజయాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. లవ్ టుడే, డ్రాగన్ వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఆయన, ఇటీవల విడుదలైన ‘LIK: Love Insurance Kompany’ సినిమాతో మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయారు. ఈ సినిమా నిరాశపరిచినప్పటికీ ప్రదీప్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే నటుడు, దర్శకుడు, కథా రచయిత, గేయ రచయితగా తన ప్రతిభను చాటుకున్న ప్రదీప్ రంగనాథన్.. ఇప్పుడు నిర్మాతగానూ అడుగుపెడుతున్నారు. తాజాగా పీఆర్ షో( ‘PR Show’ )అనే సొంత నిర్మాణ సంస్థను ప్రారంభించిన ఆయన, ఆ బ్యానర్పై తొలి చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఈ చిత్రంలో ‘ప్రేమలు’, ‘డ్యూడ్’ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మమిత బైజు కథానాయికగా నటిస్తోంది. దర్శకుడిగా పేరు తెచ్చుకుని, ప్రస్తుతం నటుడిగానూ రాణిస్తున్న అశ్వత్ మారిముత్తు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఈ సినిమాతో అనామిక మహి వెండితెరకు పరిచయం కానుండగా, తెలుగు నటుడు శివాజీ సొంటినేని, నటి స్వాసిక ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.ఈ చిత్రానికి మరో ప్రత్యేక ఆకర్షణ ‘ది ఆల్ఫా యూనిట్’. ఆరుగురు యువ దర్శకులతో ఫిల్మ్మేకింగ్ చేయడం. విశాల్ టీఆర్, యశ్ వి, నరేన్ సౌదా, చాణక్యన్ ఆర్, ధనుష్ కుమార్, ఇళంపరితి ఈ సినిమాకు సంయుక్తంగా దర్శకత్వం వహించనున్నారు. ఈ వినూత్న ప్రయత్నం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ చిత్రానికి కథను స్వయంగా ప్రదీప్ రంగనాథన్ అందించగా, యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలను ప్రదీప్ ఈ. రాఘవ్, సినిమాటోగ్రఫీని దినేష్ పురుషోత్తమన్ నిర్వహిస్తున్నారు. సినిమా ప్రకటన సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్మెంట్ వీడియో ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఇందులో నటీనటులు, సాంకేతిక బృందాన్ని పరిచయం చేస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ షెడ్యూల్, మిగతా నటీనటులు, ఇతర సాంకేతిక వివరాలను త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. నిర్మాతగా ప్రదీప్ రంగనాథన్ ప్రారంభిస్తున్న ఈ కొత్త ప్రయాణం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.