కరోనా రెండో దశ ఉధృతి వల్ల దాదాపుగా రెండు నెలల నుంచి సినిమా చిత్రీకరణలు మొత్తం ఆగిపోయాయి. ఇందులో అగ్ర కథానాయకులు నటిస్తున్న భారీ ప్రాజెక్ట్లున్నాయి. కరోనా ప్రభావం తగ్గుముఖం పడుతున్న పరిస్థితులు కనిపిస్తుండటంతో దర్శకనిర్మాతలు షూటింగ్లను పునఃప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే వరుసలో ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘సలార్’ వచ్చే నెలలో తిరిగి సెట్స్మీదకు వెళ్లనుందని తెలిసింది. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా నిర్మాణదశ నుంచే ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచుతోంది. పాన్ఇండియా మూవీగా భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్నారు.
గత మార్చిలో గోదావరిఖని ఓపెన్కాస్ట్ ఏరియాలో ప్రభాస్పై యాక్షన్ ఘట్టాల్ని రూపొందించారు. ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలనే లక్ష్యంతో ఉన్నారట ప్రభాస్. ఆ కారణంతోనే వచ్చే నెల తొలివారంలో షూటింగ్ను పునఃప్రారంభించాలని చిత్ర బృందానికి సూచించినట్లు తెలిసింది. హైదరాబాద్లో ప్రత్యేకంగా వేసిన సెట్స్లో ‘సలార్’ కొత్త షెడ్యూల్ను ఆరంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన మేజర్ షెడ్యూల్ను పూర్తిచేసిన అనంతరం ప్రభాస్ మరో పాన్ ఇండియా సినిమా ‘ఆదిపురుష్’ షూటింగ్లో జాయిన్ కానున్నారు. సెప్టెంబర్లోగా ‘సలార్’ చిత్ర ప్రధానభాగం చిత్రీకరణ పూర్తిచేసేందుకు దర్శకుడు ప్రశాంత్నీల్ ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిసింది.