డార్లింగ్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్గా అదరగొడుతున్నాడు. ఇటీవలే రాధేశ్యామ్ చిత్ర షూటింగ్ పూర్తి కాగా, ఈ చిత్రాన్ని జనవరి 14న విడుదల చేయనున్నారు. ఇక రీసెంట్గా ఆదిపురుష్ చిత్ర షూటింగ్ కూడా పూర్తి చేశాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అయితే తన తొలి బాలీవుడ్ చిత్రం ‘ఆదిపురుష్’ షూటింగ్ను పూర్తి చేసిన బాహుబలి ఇప్పుడు మూవీ సభ్యులకు ఖరీదైన రాడో వాచ్ లను బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం.
ప్రభాస్ టీంకు వాచ్లను బహుమతిగా ఇస్తున్న ఫోటోను ఆయన టీమ్ మెంబర్లలో ఒకరు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ మధ్య తన అభిమానికి కూడా ప్రభాస్ కాస్ట్ లీ గిఫ్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే. అలానే తన కో-యాక్టర్స్ కోసం ప్రత్యేకంగా వంటలు సిద్ధం చేయించి మరీ సెట్ కు తీసుకెళుతుంటాడు ప్రభాస్. ఇందులో భాగంగా గతంలో ‘బాహుబలి’, ‘సాహో’ సినిమా షూటింగ్ల సందర్భంగా తన తోటి నటీనటులకు భారీగా విందులు ఏర్పాటుచేసి సర్ప్రైజ్ చేశారు. రీసెంట్గా బాలీవుడ్ నటి దీపికా పదుకొణెకు కూడా అదిరిపోయే ఐటమ్స్తో భారీ లంచ్ ఏర్పాటుచేశారు.వాటికి ఆమె తెగ ఫిదా అయింది.
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ పౌరాణిక సినిమాలో ప్రభాస్ రాముని పాత్రలో కనిపించనున్నాడు. సీతగా కృతి సనన్ నటిస్తోంది. లక్ష్మణుడిగా బాలీవుడ్ యంగ్ హీరో సన్నీ సింగ్, రావణుడి సైఫ్ ఆలీఖాన్ కీలక పాత్రల్లో నటించనున్నారు. రూ.500 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ప్రభాస్ ప్రాజెక్ట్ కె చిత్రంతో బిజీగా ఉన్నాడు.