దేశవ్యాప్తంగా ఇమేజ్ పెంచుకుని పాన్ ఇండియా స్టార్గా పేరు తెచ్చుకున్నారు ప్రభాస్. తనకున్న ఇమేజ్ ప్రకారమే భారీ చిత్రాలు లైనప్ చేసుకుంటున్నారు. అలా ప్రభాస్ నటిస్తున్న చిత్రమే ‘సలార్’. ‘కేజీఎఫ్’ చిత్రాలతో వెండితెరపై సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శృతి హాసన్ నాయికగా నటిస్తుండగా…మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రతినాయక ఛాయలున్న పాత్రను పోషిస్తున్నారు.
ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ కొత్త ఏడాదిలో ప్రారంభం కాబోతున్నది. ప్రభాస్, పృథ్వీరాజ్ పాల్గొనే ఇంటెన్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తారని సమాచారం. ఈ షూటింగ్ హైదరాబాద్లోనే జరగనుంది. ‘భారీ యాక్షన్ సన్నివేశాలు, వాటికి బలాన్నిచ్చే భావోద్వేగాలు సలార్ ప్రత్యేకత. ఎందుకంటే ఎంత గొప్ప యాక్షన్ సీక్వెన్స్ అయినా దానికి నేపథ్యంగా నిలిచే ఎమోషన్ లేనిదే ప్రేక్షకులకు కనెక్ట్ కాదు’ అని గతంలో ఈ సినిమా గురించి నాయిక శృతిహాసన్ వెల్లడించింది. ఈ సినిమా దక్షిణాది భాషలతో పాటు హిందీలో వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న విడుదల కానుంది.