ప్రభాస్ కథానాయకుడిగా నటించిన పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్’. ఓం రౌత్ దర్శకత్వం వహించారు. రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాఘవుడి పాత్రలో కనిపించనున్నారు. కృతిసనన్ సీత పాత్రను పోషిస్తున్నది. ఈ నెల 16న ప్రపంచవాప్తంగా విడుదల కానుంది. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. మంగళవారం తిరుపతిలో ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ ‘ఈ సినిమా కోసం టీమ్ అంతా ఎనిమిది నెలలు శ్రమించాం. ఇలాంటి భారీ స్థాయి చిత్రాల్ని తీసే సందర్భంలో సమస్యలు రావడం సహజం.
ఈ సినిమాకు ఆరంభం నుంచి కష్టాలు ఎదురయ్యాయి. అన్నింటిని తట్టుకొని దర్శకుడు ఓం రౌత్ గొప్ప సంకల్పంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా నాకు ఓ భావోద్వేగ ప్రయాణం. ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది. ఈ సినిమా గురించి చిరంజీవి గారికి చెప్పినప్పుడు రామాయణ కథలో నటించడం అరుదైన అవకాశమని ప్రశంసించారు. ఇక నుంచి ఏడాదికి మూడు సినిమాలు చేస్తా. అందరూ నా పెళ్లి గురించే అడుగుతున్నారు. పెళ్లి ఎప్పుడు చేసుకున్నా తిరుపతిలో చేసుకుంటా (నవ్వుతూ)’ అన్నారు. దర్శకుడు ఔం రౌత్ మాట్లాడుతూ ‘భారతీయులందరూ మెచ్చే సినిమా ఇది. నిర్మాత భూషణ్కుమార్ గారు నాపై గొప్ప బాధ్యత పెట్టారు. ప్రభాస్ వల్లే ఈ సినిమాను ఇంత గొప్పగా తీర్చిదిద్దాను’ అన్నారు.