షూటింగ్ల నుంచి ఇక విరామం లేదంటున్నారు స్టార్ హీరో ప్రభాస్. పాన్ ఇండియా స్థాయిలో భారీ ప్రాజెక్టులన్నీ లైనప్ చేసుకున్న ప్రభాస్…ఇక వాటిని కొత్త ఏడాదిలో త్వరత్వరగా ముగించే పనిలో పడ్డారు. ఆయన నటిస్తున్న రెండు చిత్రాలు ‘సలార్’, ‘ప్రాజెక్ట్ కె’ రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. వీటిలో ‘సలార్’ షూటింగ్ ఆదివారం నుంచి హైదరాబాద్లో ప్రారంభమైనట్లు సమాచారం. దాదాపు 35 రోజుల పాటు సాగే ఈ భారీ షెడ్యూల్తో సినిమా దాదాపు పూర్తి చేయాలని ప్రభాస్ పట్టుదలగా ఉన్నారట. ఈ షెడ్యూల్లో శృతిహాసన్ సహా పలువురు కీలక నటీనటులు పాల్గొంటున్నారు. ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తున్నది. సెప్టెంబర్ 28న విడుదల తేదీగా ప్రకటించారు. ఈ చిత్రంతో పాటు పౌరాణిక నేపథ్య చిత్రం ‘ఆది పురుష్’ కూడా ఈ ఏడాదే విడుదల కాబోతున్నది. ఈ రెండు భారీ ప్రాజెక్ట్ల విడుదలతో ప్రభాస్ కెరీర్కు ఈ ఏడాది కీలకం కానుంది.