Radhe shyam | ఇన్నోవేటివ్ సినిమాలు రావాలని ప్రతి ఒక్కరం కోరుకుంటాం. కానీ ఆ దిశగా ప్రయత్నం చేసేది మాత్రం కొందరే. అలా కొత్త దారిలో నడిచే సాహసం చేశాడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. తన ఇమేజ్కు భిన్నంగా, కమర్షియల్ లెక్కలన్నీ పక్కకు పెట్టేసి రాధే శ్యామ్ వంటి ప్రయోగాత్మక చిత్రంలో నటించాడు. ఫీల్ గుడ్ లవ్ స్టోరి మాస్ హీరోలకు తగదు. అయినా ఆ కథను, అందులోని అనుభూతిని నమ్మాడు ప్రభాస్. దీన్ని ఎవరో నిర్మాతకు అంటగట్టకుండా తనే నిర్మించి, ఆ భారాన్నీ మోశాడు. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫలితాన్నీ అంతే హుందాగా స్వీకరించింది చిత్రబృందం.
విధికి, ప్రేమకు మధ్య జరిగిన పోరాటంలో గెలుపెవరిది అనే కాన్సెప్ట్ తో పామిస్ట్ అనే కొత్త తరహా పాత్రలో ప్రభాస్ రాధే శ్యామ్ తెరకెక్కింది. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ కు గత సినిమా జిల్ సక్సెస్ లేకున్నా కథను నమ్మి ప్రభాస్ అవకాశం ఇచ్చారు. ఈ చిత్ర మేకింగ్తో పరిణితి చూపించిన రాధాకృష్ణ కుమార్…కొత్త తరహా కంటెంట్ను, ఎంటర్టైన్మెంట్ను సరైన పాళ్లలో కలపలేకపోయాడు. ఫలితంగా ప్రభాస్ నుంచి ఆశించే అంశాలు లేకుండానే సినిమా తెరపైకి వచ్చింది.
రాధే శ్యామ్ ఫలితంపై ప్రభాస్ స్పందిస్తూ..నా ఇమేజ్ తొలి మూడు రోజుల సినిమా వసూళ్లను, ఫలితాన్ని ప్రభావితం చేస్తుందని అన్నారు. అంటే తన మాస్ ఇమేజ్ క్లాస్ సినిమాను బ్యాలెన్స్ చేయడం కష్టమేనని ప్రభాస్కు తెలుసు. అయినా ప్రేమకథతో రిస్క్ చేశాడు. ఇక పూజా హెగ్డే మాట్లాడుతూ…తెరపై మామూలుగా అనిపించే సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబట్టవచ్చు. కొన్ని చిత్రాలకు కలెక్షన్లు రాకపోయినా సినిమా మంచి అనుభూతిని ఇస్తుంది. మా సినిమా బాగుందనే ఆమె చెప్పుకుంది. ఇలా రాధే శ్యామ్ జంట తమ చిత్ర ఫలితాన్ని హుందాగానే స్వీకరిస్తున్నారు.