బాహుబలి తర్వాత తన స్థాయిని మరింత పెంచుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.ఇప్పటికే జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రాధే శ్యామ్ అనే చిత్ర షూటింగ్ పూర్తి చేయగా, ఈ మూవీ సంక్రాంతి బరిలో నిలవనుంది.
ఇక బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ ఆది పురుష్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. రామాయణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు. సైఫ్ అలీఖాన్ రావణుడిగా, కృతిసనన్ సీతగా కనిపించనున్నారు. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శృతి హసన్ హీరోయిన్ గా నటిస్తోంది. నాగ్ అశ్విన్ తో ప్రాజెక్ట్ కె అని ఒక సైంటిఫిక్ థ్రిల్లర్ చేస్తుండగా ఆ మధ్య బాలీవుడ్ దర్శకుడు సిద్ధార్థ ఆనంద్ తో మరో సినిమా కూడా చేస్తున్నారని వార్తలు వచ్చాయి కానీ అధికారిక ప్రకటన అయితే రాలేదు.
కొద్ది రోజులుగా ప్రభాస్ 25వ సినిమాకి సంబంధించి అనేక ప్రచారాలు జరుగుతున్న క్రమంలో ఎట్టకేలకు దీనికి సంబంధించి అఫీషియల్ ప్రకటన వచ్చింది. అర్జున్ రెడ్డి చిత్రంతో సంచలనాలు సృష్టించిన సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ తన 25వ సినిమా చేయనున్నాడు. స్పిరిట్ అనే టైటిల్తో తెరకెక్కనున్న ఈ చిత్రం భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీ గా 8 భాషల్లో తెరకెక్కనుంది. ఈ చిత్రాన్ని టీ సీరీస్ మరియు భద్రకాళి పిక్చర్స్ పతాకంపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సందీప్ రెడ్డి వంగా నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.