అగ్ర హీరో ప్రభాస్ ఇరవై ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. ‘ఈశ్వర్’ చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఆయన అనతికాలంలోనే టాప్ హీరోల్లో ఒకరిగా ఎదిగారు. ఇక ‘బాహుబలి’ చిత్రం ఆయనకు పాన్ ఇండియా హీరో ఇమేజ్ను తీసుకొచ్చింది. సినీరంగంలో ప్రభాస్ 20 వసంతాల ప్రయాణాన్ని పురస్కరించుకొని మంగళవారం హైదరాబాద్లో ఆలిండియా రెబల్స్టార్ కృష్ణంరాజు, ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షుడు జేఎస్ఆర్ శాస్త్రి ఆధ్వర్యంలో కృష్ణంరాజు నివాసంలో వేడుకల్ని నిర్వహించారు. కృష్ణంరాజు మాట్లాడుతూ ‘తొలి సినిమా చూశాక ప్రభాస్ పెద్ద హీరో అవుతాడనిపించింది. ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు. ప్రభాస్ భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా’ అన్నారు. ‘ఈశ్వర్’ చిత్ర దర్శకుడు జయంత్.సి.పరాన్జీ మాట్లాడుతూ ‘ఈ మధ్యే ప్రభాస్ను కలిశాను. పెద్ద హీరోననే గర్వం ఆయనలో ఏ మాత్రం కనిపించదు’ అన్నారు. ‘ప్రభాస్ అంత పెద్ద హీరో అయినా ప్రతి ఒక్కరితో వినమ్రంగా ఉంటాడు. ఆయన భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’ అని ‘ఈశ్వర్’ చిత్ర నిర్మాత అశోక్ కుమార్ చెప్పారు.