Pooja Hegde | కేజీఎఫ్ తర్వాత కన్నడ ఇండస్ట్రీ నుంచి విడుదలై టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తున్న చిత్రం
కాంతార (kantara). యాక్షన్ మిస్టరీ థ్రిల్లర్ నేపథ్యంలో కేజీఎఫ్ ఫేం హోంబలే ఫిలింస్ బ్యానర్లో విజయ్
కిరగందూర్ తెరకెక్కించారు. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్ పోషించిన ఈ మూవీ సెప్టెంబర్ 30న మాతృక భాష కన్నడలో విడుదలై భారీ రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రం తెలుగు వెర్షన్ను గీతా ఆర్ట్స్ బ్యానర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలుగులో కూడా మంచి టాక్తో కలెక్షన్లు వసూళ్లు చేస్తోంది. ఈ సినిమాపై పలువురు సామాన్య ప్రజలే కాకుండా సెలబ్రిటీలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.
తాజాగా నటి పూజా హెగ్దే ఈ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ‘‘మీకు ఏం తెలుసో దాన్నే రాయండి. మీ
హృదయానికి చేరువైన, మనసులో నుంచి వచ్చిన కథలనే చెప్పండి. సినిమాలోని ఆఖరి 20 నిమిషాలు స్టన్
అయిపోయాను. పూర్తిగా నన్ను నేను మైమరిచిపోయాను. రిషబ్ శెట్టి.. ‘కాంతార’ విశేషమైన ఆదరణ
పొందుతున్నందుకు గర్వంగా ఉంది. నా చిన్నతనంలో చూసిన కోలాలు, భూతాలు, దైవాలను వెండితెర మీద గౌరవప్రదంగా, అందంగా ఆవిష్కరించారు. మీరు మరిన్ని మంచి సినిమాలు తీయాలి. మరింత ఎత్తుకు ఎదగాలి’’ అంటూ తన అభిప్రాయాన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీస్లో పంచుకున్నారు.