మంగళూరు సోయగం పూజాహెగ్డే తారాపథంలో దూసుకుపోతున్నది. తెలుగు, తమిళ, హిందీ చిత్రసీమల్లో ఈ భామకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే స్టార్డమ్ వచ్చిన తర్వాత పూజాహెగ్డే ప్రవర్తనలో చాలా మార్పొచ్చిందని, నిర్మాతలపై ఆర్థికభారం మోపేలా ఆమె వైఖరి ఉందని తమిళ దర్శకనిర్మాత ఆర్.కె.సెల్వమణి ఇటీవల చెన్నైలో జరిగిన ఓ సమావేశంలో విమర్శించారు. కెరీర్ తొలినాళ్లలో పూజాహెగ్డే వ్యక్తిగత బృందంలో ఒకరిద్దరు మాత్రమే ఉండేవారని, ఇప్పుడు డజనుకుపైగా సభ్యులతో ఆమె షూటింగ్లకు హాజరవుతోందని సెల్వమణి చెప్పారు. ఆయన మాట్లాడుతూ ‘పూజాహెగ్డే టీమ్లో ఇప్పుడు పన్నెండుమందికి పైగా సభ్యులు ఉంటున్నారు. వారందరి ఖర్చులు భరించడం నిర్మాతలకు అదనపు భారమవుతున్నది. నిర్మాతల దృష్టికోణంలో ఆలోచించి పూజాహెగ్డే తన పద్ధ్దతి మార్చుకోవాలి. పరిమితమైన టీమ్ను తన వెంట తెచ్చుకోవాలి’ అని సూచించారు. ప్రస్తుతం పూజాహెగ్డే తెలుగులో రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్, ఆచార్య చిత్రాల్లో నటిస్తోంది. తమిళంలో అగ్ర హీరో విజయ్ సరసన ‘బీస్ట్’ సినిమాలో నటిస్తోంది.