Pooja Hegde | సమకాలీన కథానాయికల్లో చాలా మంది తమ సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తెరపై పాత్ర సహజంగా కనిపించడంతో పాటు అభిమానులకు కూడా మరింత చేరువకావొచ్చనే ఉద్దేశ్యంతో ఓన్ డబ్బింగ్కే ప్రాధాన్యతనిస్తున్నారు. ఇప్పటికే రష్మిక మందన్న, కీర్తి సురేష్ వంటి అగ్రతారలు డబ్బింగ్ కోసం సొంత గళాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు వీరి వరుసలో పూజాహెగ్డే చేరింది. ప్రస్తుతం ఈ భామ తమిళంలో సూర్య సరసన ‘రెట్రో’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కార్తిక్ సుబ్బరాజ్ దర్శకుడు. మే నెలలో విడుదలకానుంది.
ఈ సినిమా కోసం పూజాహెగ్డే తమిళంలో సొంతంగా డబ్బింగ్ చెప్పింది. కెరీర్ తొలిసారి తాను సొంతంగా డబ్బింగ్ చెప్పడం ఆనందంగా ఉందని, ఇక ముందు అన్ని భాషల్లో ఇదే పద్దతి ఫాలో అవుతానని పూజాహెగ్డే పేర్కొంది. తెలుగు సినిమాల్లో కూడా ఆమె ఓన్ డబ్బింగ్ చెప్పేందుకు సముఖంగా ఉందని తెలిసింది. గతకొంతకాలంగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న పూజాహెగ్డే ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీపైనే దృష్టి పెట్టింది. అక్కడ సూర్య ‘రెట్రో’, దళపతి విజయ్ ‘జన నాయగన్’, రాఘవ లారెన్స్ ‘కాంచన-4’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తున్నది. ఈ సినిమాలు దక్షిణాదిన తనకు పూర్వ వైభవం తెచ్చిపెడతాయని ధీమా వ్యక్తం చేస్తున్నది పూజాహెగ్డే.