ఏదిఏమైనా జీవితపు పరుగు ఆపొద్దని అంటున్నది మంగళూరు సోయగం పూజా హెగ్డే. అడ్డంకులను అధిగమిస్తూ సాగిపోవాల్సిందేనని ఇన్స్టాగ్రామ్లో ఈ భామ షేర్ చేసిన పోస్ట్ ఒకటి ఇప్పుడు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నది. ఇటీవలే పూజాహెగ్డే కాలికి గాయం అయిన విషయం తెలిసిందే. దాంతో ఆమె షూటింగ్కు కొద్దిరోజులు విరామం తీసుకోబోతున్నదనే వార్తలొచ్చాయి. అయితే అందరిని ఆశ్చర్యానికిగురిచేస్తూ ఈ అమ్మడు శుక్రవారం ఉత్సాహంగా షూటింగ్లో పాల్గొంది. కాలికి బ్యాండేజితో మేకప్ వేసుకుంటున్న ఓ ఫొటోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. దీనికి ఆమె ‘షో నడవాల్సిందే’ అంటూ క్యాప్షన్ను జతచేసింది. కాలికి అయిన గాయాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా వృత్తి పట్ల పూజాహెగ్డే అంకితభావాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఆమె తెలుగులో మహేష్బాబు-త్రివిక్రమ్ కాంబినేషన్ చిత్రంతో పాటు హిందీలో సల్మాన్తో కలిసి ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్’ సినిమాలో నటిస్తున్నది.