కథాంశాల ఎంపికలో గతంలో మాదిరిగా తప్పులు జరగకుండా చూసుకుంటానని, రాబోవు ఏడాదిలో వైవిధ్యమైన కథలకే ప్రాధాన్యతనిస్తానని చెప్పింది అగ్ర కథానాయిక పూజాహెగ్డే. గతకొంతకాలంగా ఈ భామకు టైమ్ కలిసి రావడం లేదు. హిందీతో పాటు దక్షిణాదిలో కూడా విజయాలకు దూరమైంది. అయితే తమిళ, తెలుగు భాషల్లో ఈ భామకు మంచి ఆఫర్లొస్తున్నట్లుగా తెలుస్తున్నది. దళపతి విజయ్ నటిస్తున్న 69వ చిత్రంలో నాయికగా ఆమె పేరే వినిపిస్తున్నది. సూర్య 44వ సినిమాలో కూడా పూజాహేగ్డే కథానాయికగా ఖరారైందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో బాలీవుడ్లో కూడా ఈ సొగసరి భారీ ఆఫర్ను సొంతం చేసుకుంది. వరుణ్ధావన్ సరసన ఓ కామెడీ ఎంటర్టైనర్లో నటించబోతున్నట్లు తెలిసింది. ‘హే జవానీ తో ఇష్క్ హోనా హై’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి డేవిడ్ ధావన్ దర్శకుడు. కాస్త విరామం తర్వాత బాలీవుడ్లో భారీ ప్రాజెక్ట్ను సొంతం చేసుకోవడం పట్ల పూజాహెగ్డే ఆనందం వ్యక్తం చేసింది. ‘సినిమాల ఎంపికలో నా మైండ్సెట్ను మార్చుకున్నా. కథల ఎంపికలో ఇకపై మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తా. నా గత చిత్రాలన్నింటిని విశ్లేషించి ఎక్కడ తప్పులు జరిగాయో తెలుసుకుంటా. వచ్చే ఏడాది నాకు మంచి విజయాల్ని అందిస్తుందనే నమ్మకంతో ఉన్నా’ అని పూజాహెగ్డే చెప్పింది.