దర్శకుడు మణిరత్నం రూపొందించిన చారిత్రక నేపథ్య చిత్రం ‘పొన్నియన్ సెల్వన్ 2’ తమిళనాట ఘన విజయం దిశగా సాగుతున్నది. తొలి భాగం ‘పొన్నియన్ సెల్వన్ 1’ దారిలోనే ఈ సినిమా కూడా రికార్డు స్థాయి వసూళ్లను సాధిస్తున్నది. ఈ సినిమా స్పెషల్ ప్రీమియర్లను పలువురు ప్రముఖులకు ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఆ ప్రదర్శనకు హాజరై సినిమాను చూసింది మనీషా కొయిరాలా. మణిరత్నం దర్శకత్వంలో ‘బొంబాయి’, ‘దిల్సే’ వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది మనీషా.
‘పొన్నియన్ సెల్వన్ 2’ ప్రీమియర్ అనంతరం ఆమె మాట్లాడుతూ…‘మణిరత్నం దర్శకత్వంలో నటించే అవకాశం రావడమే అదృష్టమని భావిస్తా. ఆయన సినిమాల్లో నటిస్తే కష్టం ఉంటుంది గానీ నటిగా పరిపూర్ణత సాధిస్తాం. ‘అంజలి’ నుంచి ‘పీఎస్ 2’ వరకు మణిరత్నం రూపొందించిన చిత్రాలన్నీ మాస్టర్ పీస్లే. ప్రతి కథను కొత్తగా తెరకెక్కించేందుకు ఆయన ప్రయత్నిస్తారు. ‘బొంబాయి’ సినిమాలో నటించిన రోజులన్నీ ఇంకా కళ్లముందే కదలాడుతున్నాయి’ అని చెప్పింది.