ఆహా: స్ట్రీమింగ్ అవుతున్నది, తారాగణం: అచ్యుత్ కుమార్, స్నేహల్ కామత్, అర్జున్ అంబటి, ప్రియా తదితరులు
దర్శకత్వం: రమేష్ ఇందిరా
దేవుళ్లను అడ్డుపెట్టుకొని మనుషులు చేసే కుట్రలు, కుతంత్రాలు ఎన్నో! అందులో బలయ్యే అమాయక జీవితాలు ఎన్నెన్నో! ఇలాంటి నేపథ్యంలో సినిమాలు రావడం కొత్తేమీ కాదు. కానీ, మైథాలజీకి మర్డర్ మిస్టరీని జోడించడం మాత్రం కొత్త ప్రయోగమే! అలా.. మర్డర్ ఇన్వెస్టిగేషన్తో సాగే హారర్ థ్రిల్లర్గా రూపొందిన తెలుగు వెబ్సిరీస్ ‘పోచమ్మ’. మొత్తం ఐదు ఎపిసోడ్స్తో ఆహా వేదికగా విడుదలై.. రికార్డ్ వ్యూస్ కొల్లగొడుతున్నది. కథలోకి వెళ్తే.. అరకులోని ఓ గ్రామంలో పోచమ్మ విగ్రహంతో ఉన్న ఓ కాఫీ ఎస్టేట్ ఉంటుంది.
ఆ ఊరి ప్రజలంతా ఆ విగ్రహాన్ని భక్తితో కొలుస్తుంటారు. ఆ ఎస్టేట్ ఓనర్ అయిన రఘుపతి (అచ్యుత్ కుమార్).. ఆర్థిక సమస్యల కారణంగా దానిని అమ్ముకొని, అందులోనే మేనేజర్గా పనిచేస్తుంటాడు. ఆ ఎస్టేట్ను ఫెడ్రిక్ (రమేష్ ఇందిరా) కొనుగోలు చేస్తాడు. కుటుంబంతో కలిసి ఆ ఎస్టేట్లోని బంగళాలో దిగుతాడు. అయితే, రఘుపతి ఎంత చెప్పినా వినిపించుకోకుండా.. తన బంగళా ఎదురుగా ఉన్న పోచమ్మ విగ్రహాన్ని ఫెడ్రిక్బలవంతంగా తొలగిస్తాడు. ఆ సంఘటన జరిగిన తర్వాత ఫెడ్రిక్ ఇంట్లో అనూహ్య సంఘటనలు చోటు చేసుకుంటాయి. అతని కుటుంబంలో తరచుగా గొడవలు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనేఫెడ్రిక్ కూతురు జెస్సీ (స్నేహల్ కామత్) అనుమానాస్పద రీతిలో మృతి చెందుతుంది.
అయితే, జెస్సీ చావుకు రఘుపతి కొడుకు సురేష్ కారణమని ఫెడ్రిక్ పెద్ద కూతురు ఇవా (ప్రియా) ఆరోపిస్తుంది. విచారణ ప్రారంభించిన పోలీసులు.. ఇవా భర్త డేవిడ్ (అర్జున్ అంబటి)ని కూడా అనుమానిస్తారు. అసలు.. జెస్సీ ఎలా చనిపోయింది? అందుకు కారణం.. పోచమ్మ విగ్రహం తొలగించడమేనా? ఫెడ్రిక్ ఇంటిపై పోచమ్మ పగబట్టిందా? మరే ఇతర కారణాలు ఉన్నాయా? సురేష్పై ఇవాకు ఎందుకు అనుమానం వస్తుంది? అసలు ఫెడ్రిక్ జీవితంలోని రహస్యాలు ఏంటి? తన కుటుంబంలో జరుగుతున్న అనర్థాలకు అసలు కారకులు ఎవరు? ఇందులో రఘుపతి కుటుంబం హస్తం ఏమైనా ఉందా? అనేది తెలియాలంటే.. పోచమ్మ వెబ్ సిరీస్ చూడాల్సిందే!