శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటిస్తున్న చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ ఉపశీర్షిక. సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని యశ్వంత్ దగ్గుమాటి నిర్మిస్తున్నారు. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం ట్రైలర్ను విడుదల చేశారు. ‘మరణం అనేది నిజంగా అంతమా? మరణించిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరైనా చెప్పగలరా? ఆత్మలు నిజంగా హాని చేస్తాయా? అంటూ అవసరాల శ్రీనివాస్ సంధించే ప్రశ్నలతో ట్రైలర్ ఆసక్తికరంగా మొదలైంది. చాలా కాలం ఖాళీగా ఉన్న ఓ పాత ఇంటిలోకి హీరో శ్రీరామ్ కుటుంబం రావడం, అక్కడ వారికి అనుకోని సంఘటనలు ఎదురుకావడం ఉత్కంఠను పంచింది. ‘మీ కుటుంబాన్ని వేధిస్తున్నది ఒక్క ఆత్మ కాదు’ అనే డైలాగ్ మరింత ఉత్కంఠను రేకెత్తించింది. విజువల్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి. యధార్థ్ధ సంఘటనల స్ఫూర్తితో మూడు కాల వ్యవధుల్లో ఈ సినిమాను తెరకెక్కించామని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సతీష్ మనోహర్, సంగీతం: కృష్ణసౌరభ్ సూరంపల్లి, కథ: సాయికిరణ్ దైదా, కవి సిద్ధార్థ.