అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో మంత్రి పేర్ని నాని, ప్రముఖ నిర్మాత, దర్శకుడు రాంగోపాల్ వర్మ( ఆర్జీవీ) మధ్య ట్విటర్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. సినిమా థియేటర్ల టికెట్ ధరల తగ్గింపుపై నిన్న ట్విటర్ ద్వారా ప్రశ్నించిన ఆర్జీవీకి సమాదానంగా మంత్రి పేర్ని నాని ఈరోజు తన ట్వీటర్ ద్వారా ఘాటుగా స్పందించారు. మంత్రి స్పందించిన మూడు గంటల అనంతరం ఆర్జీవీ వాటికి సమాదానం చెప్పారు. ప్రజా సేవ కోసం సినిమా థియేటర్లు నడిపించడం లేదని, వ్యాపారసంస్థలు గానే పనిచేస్తాయని కావాలంటే ఏపీలోని సినిమా థియేటర్ల యజమానులను అడిగి తెలుసుకోవాలన్నారు.
సినిమా టికెట్ల వ్యవహారంపై ప్రభుత్వం కల్పించుకోవాల్సిన విపరీత పరిస్థితి ప్రస్తుతం లేదని పేర్కొన్నారు. కొనే, అమ్మేవారి లావాదేవీ మాత్రమే ప్రభుత్వాలకు అవసరమని చెప్పారు. రూ.500 కూడా ఖర్చుకాని పెయింటింగ్ను రూ. 5 కోట్లకు కూడా అమ్ముతారని, ముడి పదార్థానికే వెలకడితే బ్రాండ్కు, ఐడియాకు ఎలా వెలకడతారని ఆర్జీవీ ప్రశ్నించారు. ‘ బ్లాక్ మార్కెటింగ్ ప్రభుత్వానికి తెలియకుండా చేసే నేరం.. ప్రభుత్వానికి చెప్పి అమ్మితే అది తప్పెలా అవుతుందని, పరస్పర అంగీకార లావాదేవీలకు లూటీ అనే పదం సరికాద’ ని మంత్రికి హితబోధ చేశారు.
సినిమా నిత్యావసరమని మీ నాయకులే చెప్పారు మంత్రిగారు.. ధరలు తగ్గించింది కూడా పేదవాళ్ల కోసమే అన్నారు ..పేదవాళ్లను ధనికులను చేయడం చేయాలికానీ ధనికులను పేదవాళ్లుగా చేయకూడదని అన్నారు. అలా చేస్తే ఏపీ ఇండియాలోనే పేద రాష్ట్రంగా మారే ప్రమాదముందని అన్నారు. నేను యావరేజ్ ఇంజినీర్ స్టూడెండ్ను,నాకు ఎకనామిక్స్ తెలియదు.. మీరు ఓకే అంటే ఎకనామిక్ ఎక్స్పర్డ్తో డిబేట్కు రెడి అని స్పష్టం చేశారు . మీరు.. మీ పార్టీలో నేతల్లా వ్యక్తిగత విషయాలకు వెళ్లకుండా హుందాతనాన్ని పాటించినందుకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.