‘తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఈ సినిమా తర్వాత మా సంస్థ ప్రయాణం కొత్త పంథాలో సాగుతుందని నమ్ముతున్నాం’ అన్నారు యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై ఆయన రూపొందించిన చిత్రం ‘పెదకాపు-1’. విరాట్కర్ణను హీరోగా పరిచయం చేస్తూ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మంగళవారం పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
బలవంతుడు, బలహీనుడికి మధ్య నడిచే పోరాటం ఇతివృత్తంగా ఈ సినిమా తీశాం. ఈ కథకు నేటివిటీ తోడుకావడంతో తెరపై నిజజీవితాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది. సమాజంలో నెగ్గాలంటే సామాన్యుడు ఈ స్థాయిలో పోరాటం చేయాలా అనిపిస్తుంది. అదే సమయంలో మార్పు రావాలంటే పోరాటం తప్పదనే స్ఫూర్తినిస్తుంది. 1980 దశకం నాటి కథ ఇది. అప్పటి పరిస్థితులను ప్రతిబింబిచేలా కొన్ని సెట్స్ వేశాం. రాజమండ్రి సమీపంలోని సహజమైన లొకేషన్లలో చిత్రీకరణ జరిపాం. ఈ సినిమాతో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల మరో వెట్రిమారన్ అనిపించుకుంటాడనే నమ్మకం ఉంది.
రెండు భాగాల కథ
ఓ సామాన్యుడు అసామాన్యుడిగా మారాలంటే ఒక్కరోజులో జరిగే పని కాదు. సమాజంలో శాంతిస్థాపన జరగాలంటే యుద్ధం చేయాల్సిందే. పెద్ద స్పాన్లో చెప్పాల్సిన కథ ఇది. అందుకే రెండు భాగాలుగా తీయబోతున్నాం. ఈ సినిమాలో కులాల ప్రస్తావన అస్సలు ఉండదు. ఏదైనా ఒక ప్రాంతంలో, కుటుంబంలో ఊరికి మంచి చేసే వ్యక్తిని పెదకాపు అంటారు. ఆ అర్థంలో ఈ టైటిల్ పెట్టాం. విరాట్కర్ణకు కాలేజీ రోజుల నుంచే నటనపై ఆసక్తి ఉంది. అతన్ని స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఓ పెద్ద హీరోని చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇలాంటి యాక్షన్ సినిమాకు ఓ సామాన్యుడు హీరో కావాలి. ఈ కథకు విరాట్ పక్కాగా సరిపోయాడు. కొత్త హీరో అయినా నిర్మాణపరంగా ఎలాంటి హద్దులు విధించుకోలేదు. మా సంస్థ నుంచి బాలకృష్ణగారితో ‘అఖండ-2’ ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఎప్పుడు మొదలుపెడతామో మాత్రం చెప్పలేను. మా సంస్థలో అడివి శేష్తో ఓ సినిమా చేయబోతున్నాం. మరికొన్ని చిత్రాలు చర్చల దశలో ఉన్నాయి.