చార్మినార్, జూన్ 4 : కరోనా తగ్గిన తరువాత దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, క్యాన్సర్, హెచ్ఐవీతోపాటు ఇతర వ్యాధులతో బాధపడుతున్న పలువురిపై బ్లాక్ ఫంగస్ ప్రభావం చూపుతున్నదని యునానీ వైద్యులు డాక్టర్ ఫారుఖీ తెలిపారు. బ్లాక్ ఫంగస్ను మొదట్లోనే గుర్తించి యునానీ వైద్య విధానంలో అందుబాటులో ఉన్న ఔషధాలను తీసుకుంటే సత్వర ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు. అల్క్ అజీబ్తోపాటు హబ్-ఏ ముస్సఫీ, ఖమిరా అబ్రేహం ముందులతో బ్లాక్ ఫంగస్ను నివారించవచ్చని చెప్పారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతి రోజు 50 నుంచి 60 మంది వరకు చార్మినార్ సమీపంలోని యునానీ దవాఖాన ఔట్ పేషెంట్ చికిత్సల కోసం వస్తున్నారని పేర్కొన్నారు.
ఖమిరా అబ్రేహం :- ఈ ఔషధాన్ని రెండు రకాలుగా అందిస్తారు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు పౌడర్ రూపంలో, ఇతరులకు లేహ్యంతో అందిస్తారు. పౌడర్ రూపంలో ఉన్న ఔషధాన్ని 500 మిల్లీ గ్రాముల చొప్పున ఉదయం, రాత్రి సమయంలో తీసుకోవాల్సి ఉంటుంది. లేహ్యంగా ఉన్న మందులో స్వచ్ఛమైన తేనే వినియోగిస్తారు. మధుమేహంలేని వారు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం భోజనం తరువాత 5 గ్రాముల చొప్పున తీసుకోవాలి. వారం నుంచి పది రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఈ ఔషధాలను వినియోగించాల్సి ఉంటుందని డాక్టర్ ఫారుఖీ తెలిపారు.