Pawankalyan-saidharamtej movie | సాధారణంగా ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను మనవాళ్లు ఇక్కడ రీమేక్ చేస్తుంటారు. ఇప్పటికే వందలకు పైగా సినిమాలు ఇక్కడ రీమేక్ అయి హిట్లను కూడా సాధించాయి. తాజాగా వస్తున్న భీమ్లానాయక్ చిత్రం కూడా మలయాళ చిత్రానికి రీమేక్గా తెరకెక్కింది. ఈ క్రమంలోనే సముద్రఖని నటించి దర్శకత్వం వహించిన చిత్రం వినోదయ సిత్తం తెలుగులో రీమేక్ కానుంది. ఇందులో పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించనున్నట్లు ఎప్పటినుంచే ప్రచారం అవుతుంది. తాజాగా ఈ చిత్రంలోని మరో ప్రధాన పాత్రలో మెగామేనల్లుడు సాయిధరమ్తేజ్ నటించనున్నాడనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఒక ప్రైవేట్ కంపెనీలో జనరల్ మేనేజర్గా పనిచేసే ఫ్యామిలీ మ్యాన్ ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోతాడు. చనిపోయిన వ్యక్తి ఆత్మను తీసుకెళ్ళడానికి టైం అనే క్యారెక్టర్తో దేవుడు వస్తాడు. ఆ చనిపోయిన వ్యక్తి తాను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని..తన ఫ్యామిలీని చక్కపెట్టాలని దానికి కొంత సమయం కావాలి అని దేవుడిని వేడుకుంటాడు. దానికి దేవుడు మూడు నెలల సమయాన్ని చనిపోయిన వ్యక్తి కి ఇస్తాడు. మూడు నెలల్లో చనిపోయిన వ్యక్తి ఏం పనులు చేశాడు ? తన ఫ్యామిలీని చక్కపెట్టాడా..లేదా? అనే సారాంశంతో ఈ చిత్రం తెరకెక్కింది. గతేడాది అక్టోబర్21 నుంచి జీ-5 లో తెలుగు తమిళ వెర్షన్లో స్ట్రీమింగ్ అవుతుంది. సమద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మన నేటీవిటికి తగ్గట్టు స్క్రిప్ట్లో మార్పులు చేసి ఇక్కడ రీమేక్ చేయనున్నారట. పవన్ కళ్యాణ్ ఈ చిత్రాన్ని తన సొంత బ్యానర్పై త్రివిక్రమ్ తో కలిసి నిర్మించనున్నట్టు టాక్.
ప్రస్తుతం పవన్కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ విడుదలకు సిద్ధంగా ఉంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు 60శాతం షూటింగ్ను కంప్లీట్ చేసుకుంది. దీనితో పాటుగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్సింగ్ సినిమా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.