Shihan Hussaini – Pawan kalyan | ప్రముఖ కోలీవుడ్ నటుడు, పవన్ కళ్యాణ్ గురువు షిహాన్ హుస్సేనీ(60) కన్నుమూశారు. కొన్నిరోజులుగా బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. అతని మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం, నటుడు పవన్కల్యాణ్ కూడా ఆయన మృతి పట్ల సంతాపం తెలిపాడు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు.
ప్రముఖ మార్షల్ ఆర్ట్స్, ఆర్చరీ శిక్షకులు షిహాన్ హుస్సైనీ గారు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. నేను ఆయన వద్ద కరాటే శిక్షణ పొందాను. మార్షల్ ఆర్ట్స్ గురు హుస్సైనీ గారు అనారోగ్యంతో బాధపడుతున్నారని నాలుగు రోజుల కిందటే తెలిసింది. వారి ఆరోగ్యం గురించి చెన్నైలోని నా మిత్రుల ద్వారా వాకబు చేసి, విదేశాలకు పంపించి మెరుగైన వైద్యం చేయించాల్సి ఉంటే అందుకు తగిన ఏర్పాట్లు చేస్తానని తెలిపాను. అలాగే ఈ నెల 29వ తేదీన చెన్నై వెళ్ళి హుస్సైనీ గారిని పరామర్పించాలని నిర్ణయించుకొన్నాను. ఇంతలో దుర్వార్త వినాల్సి రావడం అత్యంత బాధాకరం. హుస్సైనీ గారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను.
చెన్నైలో హుస్సైనీ కరాటేను చాలా కఠినమైన నియమ నిబంధనలతో నేర్పేవారు. ఆయన చెప్పినవి కచ్చితంగా పాటించేవాడిని, తొలుత ఆయన కరాటే నేర్పేందుకు ఒప్పుకోలేదు. ప్రస్తుతం శిక్షణ ఇవ్వడం లేదు, కుదరదు అన్నారు. ఎంతో బతిమాలితే ఒప్పుకొన్నారు. తెల్లవారుజామునే వెళ్ళి సాయంత్రం వరకూ ఆయన దగ్గర ఉంటూ కరాటేలో బ్లాక్ బెల్ట్ శిక్షణ పొందాను. తమ్ముడు చిత్రంలో కథానాయక పాత్ర కిక్ బాక్సింగ్ నేర్చుకొనేందుకు కఠోర సాదన చేసే సన్నివేశాలకు నాటి నా శిక్షణ అనుభవాలు దోహదం చేశాయి. హుస్సైనీ గారి శిక్షణలో సుమారు మూడు వేల మంది బ్లాక్ బెల్ట్ స్థాయికి చేరారు. హుస్సైనీ గారు తమిళనాడులో ఆర్చరీ క్రీడకు ప్రాచుర్యం కల్పించేందుకు కృషి చేశారు. ఆ రాష్ట్ర ఆర్చరీ అసోసియేషన్ లో ముఖ్య బాధ్యతలు నిర్వర్తించారు.
హుస్సైనీ గారి ప్రతిభ మార్షల్ ఆర్ట్స్, ఆర్బరీ రంగాలకే పరిమితం కాలేదు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. సంగీతంలో ప్రావీణ్యం ఉంది. చక్కటి చిత్రకారులు, శిల్పి. పలు చిత్రాల్లో నటించారు. స్పూర్తిదాయక ప్రసంగాలు చేసేవారు. చెన్నై రోటరీ క్లబ్, ఇతర సమావేశ మందిరాల్లో ప్రసంగించేందుకు వెళ్తుంటే వెంట తీసుకువెళ్ళేవారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన హుస్సైనీ.. మార్షల్ ఆర్ట్స్ను యువతీయువకులకు మరింత చేరువ చేయాలని ఆకాంక్షించేవారు. మరణానంతరం తన దేహాన్ని మెడికల్ కాలేజీకి అందచేయాలని ప్రకటించడం ఆయన ఆలోచన దృక్పథాన్ని వెల్లడించింది. హుస్సైనీ గారి కుటుంబానికి నా ప్రగాడ సానుభూతి తెలియచేస్తున్నాను. అంటూ పవన్ రాసుకోచ్చాడు.