జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కరోనా పాజిటివ్ వచ్చినట్టు మూడు రోజుల కింద కన్ఫర్మేషన్ వచ్చింది. వకీల్ సాబ్ సినిమాకు పని చేసిన చాలా మందికి కరోనా వచ్చింది. అందులోనే పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. దాంతో ఆయన తన ఫాంహౌస్ లోనే ఉండిపోయాడు. అక్కడే చికిత్స తీసుకున్నాడు. తనను కలిసిన వాళ్లందరూ వెంటనే టెస్ట్ చేయించుకోవాలని పవన్ కోరాడు కూడా. పవన్ కళ్యాణ్ కు వైరస్ సోకిందని తెలిసిన వెంటనే అభిమానులతో పాటు జనసేన పార్టీ కార్యకర్తలు కూడా కంగారు పడ్డారు. దానికి తోడు ఆయన హాస్పిటల్ బెడ్ పై ఉన్న ఫోటో ఒకటి బయటకు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
దాంతో ఆయన పరిస్థితి ఎలా ఉంది అని ఆరా తీశారు అభిమానులు. ఇదిలా ఉంటే ఇప్పుడు వాళ్లకు ఓ తీపి కబురు వచ్చింది. తాజాగా పవన్ కళ్యాణ్ కు కరోనా నెగిటివ్ వచ్చినట్టు తెలుస్తుంది. హైదరాబాద్లోని ట్రినిటీ ఆసుపత్రిలో ఏప్రిల్ 20 ఉదయం కోవిడ్ పరీక్ష చేయించుకున్నాడు. అందులో ఆయనకు నెగటివ్ అని వచ్చినట్లు తెలిసింది. పవన్ కళ్యాణ్ కు నెగిటివ్ అనే విషయం తెలిసిన వెంటనే జనసేన, ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ఈ ఏడాది వకీల్ సాబ్ సినిమాతో వచ్చాడు ప్రస్తుతం ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ రీమేక్తో పాటు.. క్రిష్ ‘హరిహర వీరమల్లు’ సినిమాలు చేస్తున్నాడు. వీటి తర్వాత హరీష్ శంకర్ సురేందర్ రెడ్డి సినిమాలు లైన్ లో ఉన్నాయి.