షారుఖ్ఖాన్ కథానాయకుడిగా నటించిన ‘పఠాన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డుల్ని సృష్టిస్తున్నది. 18రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 930కోట్ల వసూళ్లను సాధించింది. రెండు వారాంతాలు ముగిసినా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా జోరు కొనసాగుతూనే ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. భారత్తో పాటు విదేశాల్లో కూడా అదే స్థాయి వసూళ్లతో ‘పఠాన్’ దూసుకుపోతున్నది. పద్దెనిమిది రోజుల్లో భారతదేశ వ్యాప్తంగా ఈ చిత్రం 476కోట్లు వసూలు చేసింది. మూడోవారంలో కలెక్షన్స్ జోరు తగ్గినా..వారాంతానికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల మైలురాయిని దాటడం ఖాయమని అంటున్నారు.
కరోనా పాండమిక్ తర్వాత ‘పఠాన్’ చిత్ర విజయం బాలీవుడ్ చిత్రసీమకు నూతన జవసత్వాల్ని అందించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో షారుఖ్ఖాన్ గూఢచారిగా నటించారు.