సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం ‘డిజె టిల్లు’. విమల్కృష్ణ దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘రాజ రాజ ఐటెం రాజ..రోజా రోజా.క్రేజీ రోజా.పటాస్ పిల్ల పటాస్ పిల్ల’ అనే గీతాన్ని సోమవారం విడుదల చేశారు. కిట్టు విస్సా ప్రగడ సాహిత్యాన్నందించిన ఈ గీతాన్ని అనిరుధ్ రవిచందర్ ఆలపించారు. శ్రీచరణ్ పాకాల స్వరాల్ని సమకూర్చారు. ‘ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు మంచి స్పందన లభిస్తున్నది. వినోదప్రధానంగా సాగే ప్రేమకథా చిత్రమిది. కథానుగుణంగా సంగీతానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అని చిత్రబృందం తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా: సాయిప్రకాష్, రచన: విమల్కృష్ణ, సిద్ధు జొన్నలగడ్డ, దర్శకత్వం: విమల్కృష్ణ.