Parvathy Thiruvothu | సౌత్ లేడి సూపర్స్టార్ నయనతార నటించిన చిత్రం ‘అన్నపూరణి’ వివాదాల్లో చిక్కుకున్నది. చిత్రం వివాదాల్లో కూరుకుపోవడంతో నెట్ఫ్లిక్స్ ఇండియా ఓటీటీ ప్లాట్ఫామ్ను తొలగించింది. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, తమిళ నటి పార్వతి తిరువోతు స్పందించారు. ఓటీటీ ప్లాట్ఫామ్ నుంచి చిత్రాన్ని తొలగించడంపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీన్ని ఖండిస్తూ ఇన్స్టాలో స్టోరీ పోస్ట్ చేసింది. ‘ప్రమాదకరమైన ఉదాహరణ సెట్ చేయబడుతుంది. ఇలాంటి సినిమాలను సెన్సార్ చేయడం వల్ల మనం ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి వస్తుంది’ అంటూ పేర్కొంది.
వాస్తవానికి అన్నపూరని చిత్రంలో రాముడికి సంబంధించిన ఓ సీన్ ఉన్నది. ఇందులో రాముడిని మాంసాహారిగా చూపించగా.. విమర్శలు వెల్లువెత్తాయి. మేకర్స్పై హిందూ సంఘాల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. హిందువులు, బ్రాహ్మణ సమాజం మనోభావాలను దెబ్బతీసారని మండిపడ్డారు. అయితే, వివాదంపై మేకర్స్ విచారం వ్యక్తం చేశారు. సినిమాలోని అభ్యంతరకరమైన సన్నివేశాలను తొలగిస్తామని, సీన్లు మార్చే వరకు నెట్ఫ్లిక్స్ నుంచి తొలగిస్తామని తెలిపారు.
మార్పులు చేసిన తర్వాతనే ఓటీటీలో ప్రేక్షకులకు అందుబాటులో ఉంటుందని మేకర్స్ పేర్కొన్నారు. చిత్రంలో రాముడిని అవమానించారంటూ పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే చిత్రబృందంపై ఉత్తరప్రదేశ్లో కేసు నమోదు కాగా.. తాజాగా మధ్యప్రదేశ్ జబల్పూర్లోనూ కేసు నమోదైంది. హీరోయిన్ నయనతారతో పాటు దర్శకుడు నీలేశ్ కృష్ణ, నిర్మాతలు జథిన్ సేథీ, ఆర్ రవీంద్రన్, నెట్ఫ్లిక్ ఇండియా కంటెంట్ హెడ్ మోనికా షెర్గిల్ సహా ఏడుగురిని నిందితులుగా చేర్చారు.