తిరువీర్, పావని కరణం జంటగా నటిస్తున్న సినిమా ‘పరేషాన్’. ఈ చిత్రాన్ని వాల్తేరు ప్రొడక్షన్స్ పతాకంపై సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మిస్తున్నారు. రూపక్ రోనాల్డ్సన్ దర్శకుడు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్ర టీజర్ను మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ..‘తెలంగాణలోని ఓ పల్లెటూరి నేపథ్యంగా సాగే చిత్రమిది. అక్కడి స్నేహితుల బృందం, వారు చేసే కొంటెపనులు చిక్కులు తెచ్చిపెడతాయి. హీరో హీరోయిన్ల్ల క్యారెక్టర్స్, వారు ఎదుర్కొనే పరిస్థితులు వినోదాన్ని పంచుతాయి’ అని చెప్పారు. హీరో తిరువీర్ మాట్లాడుతూ..‘ఈ సినిమా ఆడిషన్ చేస్తున్నప్పుడే నవ్వుకున్నాను. ఆడిషన్లో చేసిన సీన్స్ నచ్చి మొత్తం కథ వినకుండానే సినిమా ఒప్పుకున్నాను. అంత నమ్మకం ఏర్పడింది. సినిమా చాలా సహజంగా సాగుతుంది. అందరికీ మంచి పేరు తెచ్చే చిత్రమవుతుంది’ అన్నారు. నాయిక పావని మాట్లాడుతూ..‘సినిమా మిమ్మల్ని కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. మన ఊరిలో జీవితాలను చూసినట్లు ఉంటుంది. మంచి సంగీతం, వినోదం ఉంటాయి’ అని చెప్పింది. నిర్మాత సిద్ధార్థ్ రాళ్లపల్లి మాట్లాడుతూ…‘ఒక ప్రత్యేకమైన చిత్రమిది. మేకింగ్లో సరికొత్త దారిని పరిచయం చేస్తుంది. ఇది కామన్ మ్యాన్ సినిమా అని చెప్పగలం. త్వరలోనే విడుదలకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు.