మేడ్చల్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ నాయకత్వంపైనే రాష్ట్ర ప్రజలకు విశ్వాసం ఉందని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆదివారం మంత్రి మల్లారెడ్డి నమస్తే తెలంగాణతో మాట్లాడారు. జాతీయ పార్టీలను తెలంగాణ ప్రజలు తిరస్కరించి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అని చాటి చెప్పారని తెలిపారు. కీలక సమయంలో మరోసారి టీఆర్ఎస్ వెంట నిలిచి భారీ మెజార్టీ అందించిన పట్టభద్రులకు కృతజ్ఞతలు తెలిపారు. వాణీదేవిని గెలిపించి అద్భుతమైన పాలన కొనసాగాలని పట్టభద్రులు తీర్పు ఇచ్చినట్లు మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. వాణీదేవి గెలుపుతో మాజీ ప్రధాని పీవీ. నరసింహారావుకు ఘనమైన నివాళులు అర్పించినట్లయిందన్నారు. సీఎం కేసీఆర్కు తెలంగాణ అభివృద్ధి తప్ప మరో ఆలోచన లేదన్నారు. పార్టీ విజయం కోసం నిరంతరం శ్రమించిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలను మంత్రి అభినందించారు. రానున్న రోజుల్లో ఇతర పార్టీల అడ్రస్లు గల్లంతు కావడం ఖాయమన్నారు.