సియోల్: ఆస్కార్ అవార్డులు గెలిచిన పారాసైట్ చిత్రంలో నటించిన లీ సున్ కున్(Lee Sun-kyun) .. అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. దక్షిణ కొరియాకు చెందిన అతని వయసు 48 ఏళ్లు. సెంట్రల్ సియోల్లోని ఓ పార్క వద్ద ఆగి ఉన్న కారులో అతన్ని స్పృహలేని స్థితిలో గుర్తించారు. అయితే నటుడు లీ బలవన్మరణానికి పాల్పడ్డాడా లేదా అన్న అంశంపై క్లారిటీ లేదు. ఇంట్లో అతను ఓ లేఖ రాసి వెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. హీరో లీ సున్పై అక్టోబర్ నుంచి డ్రగ్ కేసులో విచారణ జరుగుతున్నది.
సియోల్లోని ఓ బార్ ఉద్యోగితో కలిసి డ్రగ్స్ తీసుకున్నట్లు అతనిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అతను తీసుకున్న డ్రగ్స్ అక్రమమైనట్లు అతనికి తెలియకపోవచ్చు అని ఓ వార్తా ఏజెన్సీ తెలిపింది. తన ఇంటి వద్ద అనేక సార్లు ఆ హీరో డ్రగ్స్ తీసుకున్నట్లు ఓ మహిళ గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఆ ఆరోపణలను లీ సున్ పలుమార్లు కొట్టిపారేశాడు. లీ డిటెక్టర్ టెస్టు కూడా చేసుకోవచ్చు అని ఆ హీరో తన లాయర్ ద్వారా గతంలో తెలిపాడు.
ఓసారి మాదకద్రవ్యాల పరీక్షలో అతను నెగటివ్గా తేలాడు. కానీ కొన్ని ఫలితాలు అస్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది. లీ కున్ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు రావడంతో.. అతని ప్రతిష్టకు భంగం కలిగింది. అతన్ని నో వే ఔట్ అనే టీవీ సిరీస్ నుంచి తప్పించారు. అక్టోబర్లోనే ఆ సిరీస్ షూటింగ్ ప్రారంభమైంది.
హీరో లీ కున్ వివాహితుడు. అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. నటి జియోన్ హై జిన్ను అతను పెళ్లి చేసుకున్నాడు. దాదాపు రెండు దశాబ్ధాల నుంచి లీ కున్ యాక్టింగ్ కేరీర్లో కొనసాగాడు. డజన్ల సంఖ్యలో చిత్రాలు, టీవీ షోల్లో అతను నటించాడు. 2010 దశకంలో అతను ఓ పాపులర్ స్టార్ అయ్యాడు.
2020లో నాలుగు ఆస్కార్ అవార్డులు గెలిచిన పారాసైట్ చిత్రంలో పార్క్ డాంగ్ ఇక్ అనే పాత్రను అతను పోషించాడు. ఆ ఏడాది బెస్ట్ పిక్చర్ అవార్డును కూడా ఆ ఫిల్మ్ గెలుచుకున్నది. డ్రగ్స్ సంబంధిత కేసులను దక్షిణ కొరియాలో సిరీయస్గా తీసుకుంటారు. మారిజూనాతో పట్టుబడితే తీవ్ర నేరమే అవుతుంది. ఆ నేరం కింద అయిదేళ్ల జైలు శిక్ష విధిస్తారు.