ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ ప్రఖ్యాత సంస్థల్లో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు సీనియర్ ఐఏఎస్ అధికారి పాపారావు బియ్యాల. తెలంగాణ ఉద్యమంలో తెర వెనక వ్యూహ కర్తగా పనిచేశారు. సీనియర్ బ్యూరోక్రాట్గా జాతీయ స్థాయిలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. అయితే ఈ విజయాలేవి సినిమా పట్ల ఆయనకున్న పాషన్ను తగ్గించలేకపోయాయి. ఉద్యోగ ప్రస్థానంలో ఉన్నత శిఖరాల్ని అధిరోహించిన ఆయన ఇప్పుడు సరికొత్తగా సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ‘మ్యూజిక్ స్కూల్’ చిత్రం ద్వారా దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. శ్రియా శరణ్, శర్మన్ జోషి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ టర్న్డ్ ఫిల్మ్ డైరెక్టర్ పాపారావు బియ్యాల ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా సంభాషిస్తూ పంచుకున్న విశేషాలు..
మీ నేపథ్యం గురించి…?
తొలుత నేను అస్సాం కేడర్లో ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేశాను. ఆ తర్వాత ఏడు సంవత్సరాల పాటు ఐక్యరాజ్య సమితిలో ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించాను. అనంతరం 2006లో స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకొని తెలంగాణ ఉద్యమంలో తెర వెనక వ్యూహకర్తగా నా వంతు పాత్ర పోషించాను. బ్యూరోక్రాట్గా నాకున్న అనుభవంతో ఢిల్లీలో తెలంగాణ ఉద్యమ గళాన్ని బలంగా వినిపించే ప్రయత్నం చేశాను. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్గారి సూచన మేరకు ఐదేళ్ల పాటు ప్రభుత్వ సలహాదారుడిగా పనిచేశాను. ఆ పదవికి రాజీనామా చేసిన అనంతరం నా అభిరుచి మేరకు ‘మ్యూజిక్ స్కూల్’ సినిమా రూపకల్పనపై దృష్టి పెట్టాను.
దర్శకుడిగా తొలి చిత్రానికి సంగీత నేపథ్య ఇతివృత్తాన్ని ఎంచుకోవడానికి కారణమేమిటి?
ప్రతి మధ్య తరగతి కుటుంబానికి ఈ కథ కనెక్ట్ అవుతుంది. నేటితరం తల్లిదండ్రులు తమ పిల్లలను ఆటపాటలకు దూరంగా చదువే సర్వస్వం అనే మైండ్సెట్తోనే పెంచుతున్నారు. వారిని ఇంజనీర్స్గానో, డాక్టర్స్గానో చూసుకోవాలనే లక్ష్యంతో చదివిస్తున్నారు. ఈ ధోరణి వల్ల వాళ్లపై ఒత్తిడి పెరుగుతున్నది. ఈ కారణంగానే కొంతమంది టెన్త్, ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు పిల్లల అభిరుచుల్ని గౌరవిస్తూ వారిని సృజనాత్మకంగా తీర్చిదిద్దాలనే సందేశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రస్తుతం సమాజంలోని సీరియస్ ఇష్యూని వినోద ప్రధానంగా తెలియచెప్పే ప్రయత్నం చేశాను. ఆద్యంతం సంగీతప్రధానంగా ఈ సినిమా సాగుతుంది.
ఈ సినిమా విషయంలో మీరు ఉన్నత సాంకేతిక ప్రమాణాల్ని పాటించారని తెలిసింది?
నిర్మాణపరంగా ఎక్కడా రాజీ పడకుండా అత్యున్నత ప్రమాణాలతో సినిమాను తీర్చిదిద్దాం. ‘సౌండ్ ఆఫ్ మ్యూజిక్’ అనే పాటను లండన్లో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ను బుడాపెస్ట్లో రికార్డ్ చేశాం. ‘జోధా అక్బర్’ ‘కభీ ఖుషి కభీ ఘమ్’ చిత్రాల సినిమాటోగ్రాఫర్ కిరణ్ దియోన్స్ను కెమెరామెన్గా తీసుకున్నాం. హాలీవుడ్ కొరియోగ్రాఫర్ నృత్యరీతుల్ని సమకూర్చాడు. ఇలా ప్రతి విషయంలో ఉత్తమ నాణ్యతతో సినిమాను తెరకెక్కించాం. రెండు గంటల నిడివి ఉండే ఈ సినిమాలో సందర్భానుసారంగా పదకొండు పాటలు వస్తాయి. ప్రతీ పాట ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుంది.
రెండు గంటల నిడివి ఉన్న సినిమాలో పదకొండు పాటల్ని పెట్టడానికి కారణమేమిటి?
ఈ సినిమా కథ మొత్తం సంగీతం ప్రధానంగా నడుస్తుంది. కథ మధ్యలో బ్రేక్నిస్తూ పాటలు చూపించడం కమర్షియల్ సినిమా ఫార్మాట్. కానీ ‘మ్యూజిక్ స్కూల్’ అందుకు భిన్నంగా ఉంటుంది. పాటలన్నీ కథాగమనంలో భాగంగానే వస్తాయి. వెనకటి రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో రామాయణ, మహాభారత గాథల్న్లి పద్యరూపంలో వివరించి చెబుతుండేవారు. అదే శైలిలో నేటి ట్రెండ్కు అనుగుణంగా పాటల ద్వారా ఈ సినిమా కథను చెప్పే ప్రయత్నం చేశాను.
ఈ సినిమా ద్వారా నేటి విద్యార్థులకు ఎలాంటి సందేశాన్ని అందించబోతున్నారు?
చదువుల విషయంలో తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి తీసుకురావొద్దని చెబుతున్నాం. ఈ సందేశాన్ని సీరియస్గా కాకుండా అందరికి అర్థమయ్యే రీతిలో వినోదాత్మకంగా తెలియజెప్పే ప్రయత్నం చేశాం. సంగీత పాఠాలు నేర్పించడానికి గోవా నుంచి హైదరాబాద్ వచ్చిన మ్యూజిక్ టీచర్గా శ్రియ పాత్ర చుట్టూ ఈ కథ నడుస్తుంది. ఈ సినిమాలో చాలా మంది పిల్లలు నటించారు. వారి అభినయం ప్రధానాకర్షణగా నిలుస్తుంది.
ప్రస్తుతం వస్తున్న వాణిజ్య చిత్రాల ఒరవడిలో ఈ తరహా సంగీత ప్రధానంగా సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించడం రిస్క్ అనిపించలేదా?
ప్రేక్షకులకు రెగ్యులర్ సినిమాలు, వాటిలో వయొలెన్స్ చూసి బోర్ కొట్టింది. ప్రస్తుతం వారు రిఫ్రెషింగ్ కాన్సెప్ట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. ‘మ్యూజిక్ స్కూల్’ అదే కోవలోనిది. ఈ సినిమాలో ఎక్కడా కమర్షియల్ అంశాలు కనిపించవు. సినిమా మొత్తం ఆరోగ్యకరమైన హాస్యంతో అలరిస్తుంది. ఇళయరాజాగారి సంగీతం హైలైట్గా నిలుస్తుంది. ఈ వేసవిలో సంపూర్ణ కుటుంబ కథా చిత్రంగా ప్రతి ఒక్కరిని మెప్పిస్తుంది.
సీనియర్ ఐఏఎస్ అధికారిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వర్తించిన మీరు సినిమా రంగంవైపు ఎందుకు రావాలనుకున్నారు?
సినిమా రంగం అంటే నాకు మొదటి నుంచి ఆసక్తి ఉంది. ఐఏఎస్ ఆఫీసర్గా పదవీ విరమణ అనంతరం సృజనాత్మకంగా నా ప్రతిభను చాటుకోవడానికి ‘విల్లింగ్ టూ సాక్రిఫైజ్’ (1999) అనే డాక్యుమెంటరీ ఫిల్మ్ తీశాను. దానికి పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే 1996-97 మధ్యకాలంలో న్యూయార్స్ ఫిల్మ్ అకాడమీలో మూడు నెలల డిప్లొమా కోర్స్ చేశాను. ఆ తర్వాతే డాక్యుమెంటరీని తెరకె క్కించారు. గత కొన్నేళ్ల నుంచి నాకు నచ్చిన కాన్సెప్ట్స్తో స్క్రిప్ట్స్ సిద్ధం చేస్తున్నా. పూర్తి స్థాయిలో దర్శకత్వంపై దృష్టి పెట్టాలనే ఆలోచనతో ఉద్యోగ బాధ్యతల నుంచి వైదొలగి సినీ రంగాన్ని కెరీర్గా ఎంచుకున్నా.