కన్నడ హీరో కిచ్చా సుదీప్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘విక్రాంత్ రోణ’. జాక్వెలైన్ ఫెర్నాండేజ్, నిరూప్ భండారి, నీతా అశోక్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్ సమర్పణలో శాలిని ఆర్ట్స్ బ్యానర్పై శాలిని మంజునాథ్, జాక్ మంజునాథ్ నిర్మించారు. త్రీడీ ఫార్మాట్లో దర్శకుడు అనూప్ భండారి రూపొందిస్తున్నారు. ఈనెల 28న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో నిర్వహించారు. హీరో నాగార్జున అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా దర్శకుడు అనూప్ భండారి మాట్లాడుతూ…‘నాగార్జున గారు ఈ సినిమాకు ఇచ్చిన సహకారం మర్చిపోలేము. కోవిడ్ టైమ్లో ఆయన స్టూడియోలోనే మా సినిమా వర్క్ అంతా జరిగింది. హైదరాబాద్లో ఎక్కువ శాతం షూటింగ్ చేశాం. విజయ్ మాస్టర్, జానీ మాస్టర్, రామజోగయ్య శాస్త్రి లాంటి ఇక్కడి సాంకేతిక నిపుణులు మా చిత్రానికి పనిచేశారు. 2డీ, త్రీడీ ఫార్మాట్లో తెరకెక్కించిన మా సినిమా ప్రేక్షకులకు తప్పకుండా కొత్త అనుభూతిని పంచుతుంది’ అన్నారు.
హీరో కిచ్చా సుదీప్ మాట్లాడుతూ…‘ఒక్క ఫోన్ కాల్తో మా కార్యక్రమానికి వచ్చి విషెస్ చెప్పిన నాగార్జున గారికి థాంక్స్. ఈ సినిమా మూడొంతులు షూటింగ్ హైదరాబాద్లో చేస్తే, అందులో 90 శాతం అన్నపూర్ణ స్టూడియోలో జరిపాం. ఇక్కడి టెక్నీషియన్స్ సహకారంతో పాండమిక్లో షూటింగ్ పూర్తిచేయగలిగాం. సినిమాటిక్ అనుభూతిని పంచేందుకు త్రీడీ ఫార్మాట్లో మీ ముందుకు తీసుకొస్తున్నాం’ అన్నారు.
నాగార్జున మాట్లాడుతూ…‘మన దగ్గర సినిమాలు రూపొందించారు అని గర్వంగా చెప్పుకునే సినిమాలు ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’లా కొన్నే ఉంటాయి. విక్రాంత్ రోణ అలా చెప్పుకునే సినిమా అవుతుంది. ట్రైలర్ చాలా బాగుంది. మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా అవుతుంది. కంటెంట్ నచ్చితే తెలుగు ప్రేక్షకులు ఏ సినిమాకైనా ఘన విజయాన్ని అందిస్తారు’ అన్నారు. ఈ కార్యక్రమంలో నటీనటులు నీతూ, నిరూప్ భండారీ, జానీ మాస్టర్, గీత రచయిత రామజోగయ్య శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.