అడివి శేష్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘మేజర్’. శోభితా ధూళిపాళ, సయీ మంజ్రేకర్ నాయికలుగా నటిస్తున్నారు. ముంబై ఉగ్రదాడుల్లో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతున్నది. శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించారు. జూన్ 3న విడుదల కానుంది.
ఈ సందర్భంగా సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ..‘అడివి శేష్తో నాకిది ఆరో సినిమా. ఇటీవల నాకు ‘డీజే టిల్లు’ రూపంలో మంచి హిట్ సినిమా దక్కింది. తర్వాతి చిత్రమే ‘మేజర్’ వంటి పాన్ ఇండియా మూవీ రావడం సంతోషంగా ఉంది. ఇది ఒక వీర సైనికుడి జీవిత కథ. అతని జీవితంలో ప్రేమ, దేశభక్తి వంటి భావోద్వేగాలు ఉంటాయి.
వాటికి అనుగుణంగా పాటలు, నేపథ్యం సంగీతం సమకూర్చాను. ఈ కథ 90వ దశకంలో మొదలవుతుంది కాబట్టి ఆ సమయంలో మ్యూజిక్ ఎలా ఉండేదో పరిశీలించి ఈ సినిమాకు అందించాను. ఈ చిత్రంలోని భావోద్వేగాలకు ప్రేక్షకులంతా కనెక్ట్ అవుతారు. సంగీతం ద్వారా ఆ ఫీల్ను మరింత పెంచానని భావిస్తున్నాను. అన్నారు.