రక్షిత్ శెట్టి కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ఛార్లి 777’. కిరణ్రాజ్ కె దర్శకుడు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై రానా దగ్గుబాటి సమర్పకుడిగా ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నారు. జూన్ 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో ఛార్లి అనే కుక్క టైటిల్ పాత్రలో నటించడం విశేషం. శనివారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన సమావేశంలో రక్షిత్శెట్టి మాట్లాడుతూ ‘ఇందులో నేను ధర్మ అనే పాత్రలో అంతర్ముఖుడిగా కనిపిస్తాను.
ఎవరి తోడులేకుండా ఒంటరిగా జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతుంటా. అలాంటి వ్యక్తి జీవితంలోకి ఓ కుక్క ప్రవేశిస్తే ఎలాంటి మార్పులొచ్చాయన్నది సినిమా కథ. ఇది మిమ్మల్ని నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. సరికొత్త ప్రయోగంగా మిగిలిపోతుంది’ అన్నారు. ఈ సినిమా చూసినప్పుడు తనకు కన్నీళ్లొచ్చాయని రానా తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: అరవింద్ ఎస్.కశ్యప్, సంగీతం: నోబిన్ పాల్, నిర్మాతలు: జి.ఎస్.గుప్తా, రక్షిత్శెట్టి.