Padma Shri Daripalli Ramaiah | పర్యావరణ పరిరక్షణే శ్వాసగా, కోట్లాది మొక్కలను నాటి దేశవ్యాప్తంగా అపరిమితమైన గుర్తింపు తెచ్చుకున్న పద్మశ్రీ పురస్కార గ్రహీత, వనజీవి దరిపల్లి రామయ్య జీవిత విశేషాలు త్వరలోనే వెండితెరపై పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్గా ఆవిష్కృతం కానున్నాయి. వాస్విక్ ఫౌండేషన్ పర్యవేక్షణలో, వనజీవి రామయ్య గారి 90వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్లో ‘వనజీవి హరిత అవార్డు పురస్కార మహోత్సవం’ అత్యంత వైభవంగా జరిగింది. ప్రకృతి కాపాడుకోవడంలో విశేషమైన సేవలందిస్తున్న పలువురు సామాజిక, పర్యావరణ కార్యకర్తలను ఈ వేదికపై ఘనంగా సత్కరించారు. ఈ ప్రత్యేక సందర్భంలో వాస్విక్ గ్రూప్ చైర్మన్, ప్రముఖ సినీ నిర్మాత నిడిగొండ నరేష్ ప్రజాపతి ఒక కీలకమైన ప్రకటన చేశారు. సమాజంలో పర్యావరణ స్పృహను పెంపొందించడానికి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ‘పల్లె ప్రకృతి వనాలకు’ వనజీవి దరిపల్లి రామయ్య గారి పేరును పెట్టాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఇప్పటికే దరిపల్లి రామయ్య గారి మహోన్నత జీవిత కథ ఆధారంగా రూపొందిన ‘వనజీవి రామయ్య’ లఘుచిత్రం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే ‘గద్దర్ అవార్డ్స్’లో ఉత్తమ లఘుచిత్రాల విభాగానికి ఎంపికై సంచలనం సృష్టించింది. ఈ లఘుచిత్రంలో టాలెంటెడ్ నటుడు బ్రహ్మాజీ వనజీవి పాత్రలో జీవించగా, నంది అవార్డు గ్రహీత వేముగంటి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. డాక్టర్ కళా రంగా అందించిన అద్భుతమైన కథకు బల్లేపల్లి మోహన్ హృదయానికి హత్తుకునే సంగీతాన్ని సమకూర్చారు. నిడిగొండ నరేష్ కుమార్ ప్రజాపతి ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. లఘుచిత్రానికి లభిస్తున్న అపూర్వ స్పందనను చూసి, ఈ కథను మరింత విస్తృతంగా ప్రపంచానికి పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే దీనిని త్వరలోనే పూర్తి స్థాయి పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్గా భారీ బడ్జెట్తో నిర్మించబోతున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది.
ఈ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి వాస్విక్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ నూకల భాస్కర్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు నాయకత్వం వహించారు. కార్యక్రమంలో భాగంగా మొక్కల వెంకటయ్యను ప్రత్యేకంగా సన్మానించడంతో పాటు, సమాజం కోసం నిరంతరం శ్రమిస్తున్న పలువురు ప్రకృతి ప్రేమికులకు హరిత పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా మొక్కల సత్యనారాయణ, మొక్కల వెంకటయ్య మాట్లాడుతూ ప్రకృతే సర్వస్వమని, ప్రతి కుటుంబం బాధ్యతగా మొక్కలను నాటి సంరక్షించినప్పుడే భావితరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందుతాయని పిలుపునిచ్చారు. 50 ఏళ్ల క్రితమే రాబోయే పర్యావరణ సంక్షోభాన్ని గుర్తించిన దూరదృష్టి గల మహనీయుడు రామయ్య అని, ఆయన ఆశయ సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ‘మొక్కలు నాటే యాత్ర’ను చేపట్టబోతున్నట్లు నిర్మాత నిడిగొండ నరేష్ ప్రజాపతి వెల్లడించారు.
దర్శకుడు వేముగంటి మరియు సంగీత దర్శకుడు బల్లేపల్లి మోహన్ మాట్లాడుతూ ఏడు దశాబ్దాల పాటు వనజీవి చేసిన త్యాగాన్ని వెండితెరపై ఆవిష్కరించడం తమకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నామని, ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు. చిత్ర కథానాయిక నాగరాణి ఇంతటి సందేశాత్మక చిత్రంలో భాగం కావడం తన అదృష్టమని పేర్కొన్నారు. తోట కే రమణ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రంలో నాగమళ్ళ మహేష్, సురేష్ బాబు, కేవీఎం వెంకట్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఘనయాది సాహిత్యం అందించగా, అशోక్ దయ్యాల పీఆర్ఓగా వ్యవహరించారు. ఈ వేడుకలో వాస్విక్ ఫౌండేషన్ సభ్యులు నూకల నర్సింహారెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ మల్లిక్ తేజ, మాజీ సైనికులు వెంకట అప్పారావు, రిటైర్డ్ జీఎం విశ్వనాథ, వినయ్ రెడ్డి, మహేంద్ర వర్మ, నవీన్లతో పాటు పెద్ద సంఖ్యలో సామాజిక కార్యకర్తలు పాల్గొని వనజీవి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేశారు.