Biggboss Winner | తెలుగు బిగ్బాస్ ఫైనల్స్ రోజు జరిగిన దాడి ఘటనలో బిగ్బాస్ విజేత పల్లవి ప్రశాంత్పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. కేసును సుమోటోగా తీసుకున్న పోలీసులు విచారణ జరిపిన అనంతరం ఈ దాడులకు ముఖ్య కారణం పల్లవి ప్రశాంత్ అని తేల్చారు. దీంతో ఈ కేసులో పల్లవి ప్రశాంత్ను ప్రధాన నిందితుడిగా(ఎ-1) కేసు నమోదు చేశారు. అలాగే అతని సోదరుడు, స్నేహితుడిని సైతం నిందితులుగా(ఎ-2, ఎ-3) నమోదు చేసి మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అలాగే వీరికి సంబంధించిన రెండు కార్లను సీజ్ చేసినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు వెల్లడించారు. ఇక ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నట్లు తెలుస్తుంది.
ఇంతకీ ఏం జరిగిందంటే.. గత ఆదివారం బిగ్బాస్ ఫైనల్స్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఫైనల్స్ నేపథ్యంలో అన్నపూర్ణ స్టూడియోస్కు అమర్, ప్రశాంత్ అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. అయితే పల్లవి ప్రశాంత్ బిగ్బాస్ సీజన్ 7 విజేత (Bigg boss Winner) అని ప్రకటించగానే ప్రశాంత్ అభిమానులు సంబురాలు చేసుకున్నారు. ఈ సంబరాల్లో ఇరువురి అభిమానుల మధ్య మొదలైన వాగ్వాదం పరస్పర దాడులకు దారితీసింది. ఒకరినొకరు తోసుకుంటూ పిడిగుద్దులు గుద్దుకున్నారు. అటుగా వెళ్తున్న టీఎస్ఆర్టీసికి చెందిన 6 సిటీ బస్సులపై దాడిచేసి అద్దాలు పగలగొట్టారు. ఇక బందోబస్తుకు వచ్చిన పంజాగుట్ట పోలీస్ వాహనం అద్దంతో పాటు విధులు నిర్వర్తించడానికి వచ్చిన బెటాలియన్ బస్సు అద్దాన్ని కూడా అభిమానులు పగలగొట్టారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇక ఈ దాడులను సుమోటోగా స్వీకరించిన జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్తో పాటు అతని అభిమానులపై కేసు నమోదు చేశారు.