స్వర్గీయ సిరివెన్నెల సీతారామశాస్త్రి తెలుగు సినిమా పాట గమనానికి మార్గదర్శనం చేశారని కొనియాడారు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. తానా ప్రపంచ సాహిత్య వేదిక, సిరివెన్నెల కుటుంబం ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ శిల్పకళావేదికలో సిరివెన్నెల సీతారామశాస్త్రి జయంతి వేడుకల్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. తోటకూర ప్రసాద్ సభాధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సిరివెన్నెల సీతారామశాస్త్రి సమగ్ర సాహిత్యం మొదటి సంపుటిని వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. తొలి ప్రతిని సిరివెన్నెల సతీమణి పద్మావతి స్వీకరించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ ‘సీతారామశాస్త్రితో నాకు చిన్నతనంలోనే స్నేహం ఉంది. అనకాపల్లిలో ఆయన పాటలతో ప్రతిరోజు కాలక్షేపం చేసేవాడిని.
సిరివెన్నెల ఇంతింతై వటుడింతై అన్న చందంగా చిత్రసీమలో ఎదిగారు. సినీ పాటల రూపంలో తెలుగు తల్లికి పాటల పదార్చన చేశారాయన. తెలుగు సినిమా పాటకు సాహిత్య గౌరవాన్ని తీసుకొచ్చారు. పాటను అర్థిక కోణంలో చూడకుండా అర్థవంతంగా తీర్చిదిద్దిన అగ్రగణ్యుడు సిరివెన్నెల. సినిమా పాటల్లో విలువల్ని రాశులుగా పోసి పండితుల్ని, పామరుల్ని మెప్పించారు. పాట ద్వారా ప్రజల్లో సీతారామశాస్త్రి గొప్ప ఆలోచనల్ని రేకెత్తించారు. ప్రాపంచిక విలువల్ని, ఆలోచనల్ని పెంచే విధంగా ప్రజలకు కర్తవ్యాన్ని బోధిస్తూ ఆయన సాహిత్యం కొనసాగింది. సిరివెన్నెల కీర్తి అజరామరం. ముందుతరాల వారు ఆయన స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి. నేను ఉపరాష్ట్రపతి అయిన తర్వాత సీతారామశాస్త్రిగారు ఓ సందర్భంలో నన్ను కలిశారు. ఆయన చెప్పిన మాటలు ఇంకా గుర్తున్నాయి’ అన్నారు. త్రివిక్రమ్ మాట్లాడుతూ ‘సీతారామశాస్త్రితో ఎన్నో పాటల ముచ్చట్లను పంచుకున్నా. ఆయన సినిమా పాటకన్నా ఎత్తైన మనిషి. పాటలోని భావం కన్నా లోతైన మనిషి. ఆ పాట మనకు అర్థమైన దానికన్నా విస్తారమైన మనిషి. అలాంటి గొప్ప మనిషితో కొంతకాలం గడపడం అదృష్టంగా భావిస్తున్నా’ అని చెప్పారు.