“పాగల్’ సినిమా విషయంలో చాలా మంది రకరకాల కామెంట్స్ చేశారు. సినిమా విజయమే వారికి సమాధానం చెప్పింది’ అన్నారు విశ్వక్సేన్. ఆయన కథానాయకుడిగా దిల్రాజు సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ నిర్మించిన చిత్రం ‘పాగల్’. నరేష్ కుప్పిలి దర్శకుడు. ఇటీవలే ప్రేక్షకులముందుకొచ్చింది. సోమవారం సక్సెస్మీట్ను నిర్వహించారు. విశ్వక్సేన్ మాట్లాడుతూ ‘ఈ సినిమా బాగా ఆడకపోతే నా పేరు మార్చుకుంటానని ప్రీరిలీజ్ వేడుకలో చెప్పాను. ఈ సినిమా హిట్తో నా నమ్మకం నిజమైంది. ఇప్పుడు నేను పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు. వారాంతంలో 6.5కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. సింగిల్స్క్రీన్స్లో అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. ఏపీలో సగం ఆక్యుపెన్సీతో పాటు టిక్కెట్ రేట్లు తక్కువగా ఉన్నా ప్రేక్షకులు చక్కటి ఆదరణ కనబరుస్తున్నారు’ అని చెప్పారు. ‘ఈ సినిమా కోసం దర్శకుడు నరేష్ మూడేళ్లుగా నాతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. విశ్వక్సేన్ సినిమా కోసం ఎంతో శ్రమించాడు. అన్ని పనుల్ని దగ్గరుండి చూసుకున్నాడు. దిల్రాజు సహకారంతో సినిమాను థియేటర్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ చిత్ర విజయంలో మద్దతుగా నిలిచిన అందరికి కృతజ్ఞతలు’ అని నిర్మాత బెక్కెం వేణుగోపాల్ తెలిపారు. ఈ సినిమా ఒక ఎమోషనల్ జర్నీ అని..తమ కష్టానికి తగిన ఫలితం దక్కిందని కథానాయికలు నివేదా పేతురాజ్, మేఘ ఆనందం వ్యక్తం చేశారు.