‘ప్రేక్షకులు పెట్టే ప్రతి పైసాకి న్యాయం చేయాలనే సంకల్పంతోనే సినిమాలు చేస్తుంటాను. సినిమా సినిమాకూ ప్రేక్షకులకు కొత్త అనుభూతుల్ని పంచుకుంటూ వెళ్లడం నటుడిగా నా ధర్మం. ఆ పాషన్తో చేసిన సినిమానే ‘ఆపరేషన్ వాలెంటైన్’ ’ అన్నారు హీరో వరుణ్తేజ్. ఆయన కథానాయకుడిగా మానుషి చిల్లర్ హీరోయిన్గా రూపొందిన ఏరియల్ వార్ డ్రామా ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్సింగ్ హడా దర్శకుడు. సందీప్ ముద్దా నిర్మాత. మార్చి 1న పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ను మంగళవారం హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా వరుణ్తేజ్ మాట్లాడుతూ ‘తెలుగులో వస్తున్న తొలి ఏరియల్ ఫిల్మ్ ‘ఆపరేషన్ వాలెంటైన్’. ప్రేక్షకులు కుర్చీల అంచున కూర్చుని, రోమాంచితమైన అనుభూతిని పొందే ఉత్కంఠభరితమైన సన్నివేశాలు ఇందులో చాలా ఉన్నాయి. గుండెల నిండా దేశభక్తిని నింపే సినిమా ఇది. జవాన్ల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి ధైర్యసాహసాలని మీ ముందుకు తీసుకురావడానికి మేం చేస్తున్న చిన్న ప్రయత్నం ‘ఆపరేషన్ వాలెంటైన్’ అని పేర్కొన్నారు . తన కెరీర్కి ‘ఆపరేషన్ వాలెంటైన్’ చాలా ప్రత్యేకమైన సినిమా అని మానుషి చిల్లర్ అన్నారు. యాక్షన్, డ్రామా, ఫన్, ఎమోషన్ అన్నీ కథలో ఉంటాయని, టీం అందరం ప్రాణం పెట్టి పనిచేశామని దర్శకుడు తెలిపారు.