‘ కొత్త కంటెంట్తో, కొత్త జానర్లో సినిమా చేస్తే తప్పకుండా విజయం సాధిస్తుందని నా నమ్మకం. అందుకే సినిమా నిర్మించాలి అనుకున్నప్పుడు భిన్నమైన కథ కోసం చూశాను. వి.ఐ.ఆనంద్ చెప్పిన కథ కొత్తగా అనిపించింది. విజయంపై సంపూర్ణ నమ్మకంతో ఈ సినిమా చేశాం. విడుదలకు ముందే నిర్మాతగా అన్ని విధాలుగా సంతోషంగా ఉన్నాను.’ అన్నారు నిర్మాత రాజేశ్ దండా.
హాస్య మూవీస్ పతాకంపై ఆయన నిర్మించిన చిత్రం ‘ఊరుపేరు భైరవకోన’. సందీప్కిషన్, కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ ప్రధానపాత్రధారులు. వి.ఐ.ఆనంద్ దర్శకుడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ నెల 16న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత విలేకరులతో ముచ్చటించారు. ‘ప్రీమియర్ షోస్ అన్నీ ఫుల్ అయ్యాయి.
ఈ సినిమాకు ఉన్న క్రేజ్కి అదే నిదర్శనం. భైరవకోన అనే ఊర్లో జరిగే ఊహించని సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. గరుడపురాణంలో మిస్ అయిన పేజీలకి, ఈ కథకి వున్న లింక్ చాలా ఆసక్తికరంగా ఉంది. 47 నిమిషాల అద్భుతమైన సీజీ వర్క్ ఈ సినిమాకు ప్రధాన బలం. ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది’ అని రాజేశ్ దండా చెప్పారు.
అనిల్ సుంకర విలువైన సూచనలు ఈ సినిమాకు చాలా హెల్ప్ అయ్యాయని, సందీప్ కిషన్ చాలా కష్టపడ్డాడని, సినిమాకు చాలా హెల్ప్ అయ్యాడని, మా సంస్థకి నంబర్వన్ సినిమా అవుతుందని నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు. సాంకేతికంగా అద్భుతంగా ఉండే ఈ సినిమాలో శేఖర్చంద్ర సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని నిర్మాత తెలిపారు. అల్లరి నరేశ్తో ‘బచ్చల మల్లి’ సినిమా చేస్తున్నామని, అలాగే కిరణ్ అబ్బవరంతో కూడా ఓ సినిమా ఉంటుందని ఆయన చెప్పారు.