తన గానంతో కోట్లాది శ్రోతలని పరవశింపజేసిన గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్యణ్యం. ఎస్పీ బాలు పూర్తిపేరు శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం. ఆయితే అందరికీ ఆయన బాలుగా సుపరిచితుడు. పాటలు పాడడమే కాక సంగీత దర్శకత్వం కూడా వహించిన ఆయన నిర్మాతగాను తన సత్తా చూపించారు. మిథునం ఆయనకు నటుడిగానూ మంచి గుర్తింపు తెచ్చింది. డబ్బింగ్ ఆర్టిస్ట్గా కూడా బాలు పని చేశారు.
తెలుగు, తమిళంతోపాటు కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ప్రధానంగా ఆయన పాటలు వినిపిస్తాయి. మొత్తంగా చూస్తే 16కుపైగా భాషల్లో ఆయన పాటలు పాడారు. 40,000కుపైగా పాటలు పాడి ఆయన గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఆయన కెరీర్ అప్రతిహాతంగా సాగుతున్న వేళ బాలుకి కరోనా సోకింది.ఆగస్ట్ 5, 2020న తనకు కరోనా సోకిందని చెప్పిన బాలు చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
శుక్రవారం(సెప్టెంబరు 25,2020) మధ్యాహ్నం 1.04 గంటలకు ఆయన తుది శ్వాస విడిచినట్లు ఎంజీఎం హెల్త్కేర్ ఆసుపత్రి తెలిపింది. ఈ వార్తతో అందరి గుండెలు పగిలాయి. బాలు ఇక మన మధ్య లేడనే వార్తని ఎవరు జీర్ణించుకోలేకపోయారు. నీవు లేకపోయినా..నీ పాట ఆ చంద్రతారార్కం నిలిచే ఉంటుందంటూ తోటి గాయకులు, సినీ సంగీతాభిమానులు బరువైన గుండెతో కన్నీటి వీడ్కోలు పలికారు.బాలు మరణించి ఏడాది పూర్తైన సందర్భంగా ఈ రోజు ఆయన సంస్మరణ కార్యక్రమాలను నిర్వహిస్తూ బాలు జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటున్నారు.