NTR | లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన తాజా చిత్రం ‘సింగ్ గీతం’ ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లపై దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ చిత్రం జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం, చిత్రంలోని భావోద్వేగాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటుండగా, తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సినిమాపై చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ‘సింగ్ గీతం’ చిత్రాన్ని వీక్షించిన ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సినిమా తన హృదయాన్ని హత్తుకుందని పేర్కొన్న ఆయన, 94 ఏళ్ల వయసులోనూ సింగీతం శ్రీనివాసరావు గారు చూపించిన సృజనాత్మకత, కథల పట్ల ఉన్న అంకితభావం తనను ఆశ్చర్యపరిచిందన్నారు.
వయసు కేవలం సంఖ్య మాత్రమేనని, ప్రతిభకు వయసుతో సంబంధం లేదని ఈ సినిమా మరోసారి నిరూపించిందని తెలిపారు. అలాగే ఈ ప్రాజెక్ట్ను నిర్మించిన నాగ్ అశ్విన్ను ప్రత్యేకంగా అభినందించిన ఎన్టీఆర్, నాలుగు దశాబ్దాలుగా సింగీతం శ్రీనివాసరావు గారి మనసులో ఉన్న కలను తెరపైకి తీసుకురావడం గొప్ప విషయమన్నారు. ఒక లెజెండ్ కలను సాకారం చేయడం నిజంగా అరుదైన ఘనత అని కొనియాడారు. సింగీతం గారికి వైజయంతి మూవీస్, నాగ్ అశ్విన్ అందించిన ఈ సినిమా అందమైన నివాళిగా నిలిచిందని వ్యాఖ్యానించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంపై కూడా ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించారు. డీఎస్పీ అందించిన స్వరాలు సినిమాలోని ప్రతి భావోద్వేగాన్ని ప్రేక్షకుల హృదయాలకు చేరవేశాయని, కథను మరింత బలంగా నిలబెట్టాయని అన్నారు. ప్రతి సన్నివేశంలో సంగీతం ఒక ప్రత్యేకమైన మాయాజాలాన్ని సృష్టించిందని పేర్కొన్నారు.
ఇక సినిమా ప్రమోషన్స్ విషయంలో మేకర్స్ అనుసరించిన వినూత్న విధానం తనను ఆశ్చర్యపరిచిందని ఎన్టీఆర్ తెలిపారు. సాధారణంగా సినిమాలు విడుదలకు ముందే ట్రైలర్ను విడుదల చేస్తారని, కానీ ‘సింగ్ గీతం’ విషయంలో సినిమా విడుదలైన తర్వాత ట్రైలర్ను విడుదల చేయడం నిజంగా సర్ప్రైజింగ్గా అనిపించిందన్నారు. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లలో సినిమా చూడాలని సూచించారు. “‘సింగ్ గీతం’ నా హృదయానికి హత్తుకున్న అద్భుతమైన చిత్రం. 94 ఏళ్ల వయసులోనూ సింగీతం శ్రీనివాసరావు గారి సృజనాత్మకత స్ఫూర్తిదాయకం. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించారు. ఒక లెజెండ్ 40 ఏళ్ల కలను సాకారం చేయడం దేవుడు ఇచ్చిన వరం లాంటిది. నాగ్ అశ్విన్, వైజయంతి మూవీస్ ఈ కలను నిజం చేసి గొప్ప నివాళి అర్పించారు” అంటూ ఎన్టీఆర్ తన పోస్టులో పేర్కొన్నారు.