NTR Birthday special | నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. తన నటన, అభినయంతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. ఒక పాత్రలో నటించేవారు చాలా మంది ఉంటారు. కానీ పాత్రలో జీవించే వారు కొంత మంది మాత్రమే ఉంటారు. అలాంటి నటులలో ఎన్టీఆర్ ఒకడు. మాములు పాత్ర అయినా సరే ఎన్టీఆర్ తన నటనతో ఆ పాత్రకు ప్రాణం పోస్తాడు. ఎలాంటి ఆలోచనలో ఉన్నా గాని కెమెరా కనబడితే చాలు వెంటనే తన పాత్రలోకి ప్రవేశం చేస్తాడు. టాలీవుడ్లో ప్రతి దర్శకుడు ఎన్టీఆర్తో ఒక్క సినిమానైనా చేయాలని ఎంతగానో ఆసక్తి చూపుతుంటారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ వరుస పాన్ ఇండియా కథలను ఓకే చేస్తూ సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. శుక్రవారం తారక్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో బర్త్డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి.
జూ.ఎన్టీఆర్ 1983 మే 20న హైదరాబాద్లో జన్మించాడు. తారక్ చిన్నప్పుడే భరతనాట్యం, కూచిపూడీలు నేర్చుకుని ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాడు. తారక్కు తొమ్మిదేళ్ళ వయసునుప్పుడు తాత సీనియర్ ఎన్టీఆర్ ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాలో చిన్న పాత్ర నటింపజేశాడు.ఈ చిత్రంలో తారక్ నటన చూసి మురిసిపోయాడు. ఈ క్రమంలోనే సీనియర్ ఎన్టీఆర్ తనకు అత్యంత సన్నిహితుడై ఎమ్.ఎస్ రెడ్డి గారిని పిలిపించి తారక్ వయసుకు తగ్గ కథను ఎంచుకొని సినిమా తీయమని చెప్పాడు. దాంతో ఎమ్.ఎస్ రెడ్డి, గుణశేఖర్ను పిలిపించి తారక్ గురించి చెప్పాడు. ఇక గుణశేఖర్ తారక్ను అన్ని విధాల ఆడిషన్ చేసి రామయణం కథను బాలలతో తెరకెక్కిద్దాం అని సీనియర్ ఎన్టీఆర్కు చెప్పాడు. దానికి సీనియర్ ఎన్టీఆర్ కూడా ఓకే చెప్పాడు.
నెలరోజుల ట్రైనింగ్ తర్వాత1995 జూన్లో బాలల రామాయణం షూటింగ్ మొదలు పెట్టారు. ఆరు నెలల్లో షూటింగ్ పూర్తి చేసి 1996 ఏప్రిల్లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి జాతీయ అవార్డు వచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులకు తారక్ సినిమా ఆఫీస్ల చుట్టూ తిరుగుతూ తనతో సినిమా చేయమని పలువురు దర్శకులు, నిర్మాతలను అడిగాడు. అలా బ్యాక్గ్రౌండ్ ఉండి కూడా తారక్ అవకాశాల కోసం తిరిగాడు. ఈ క్రమంలోనే ‘నిన్ను చూడాలని’ సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. వి.ఆర్ ప్రతాప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రామోజిరావు నిర్మించాడు. ఈ సినిమా అశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అలా కొన్ని రోజుల తర్వాత ఎస్ఎస్. రాజమౌళి దర్శకుడిగా పరిచయమవుతూ తారక్తో ‘స్టూడెంట్ నం.1’ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ చిత్రం తారక్కు బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఈ చిత్రం తర్వాత ‘సుబ్బు’ విడుదలై ఫ్లాప్గా నిలిచింది. అప్పుడే వివి వినాయక్ తారక్కు ‘ఆది’ కథను చెప్పాడు. కథ నచ్చడంతో ఎన్టీఆర్ కూడా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 2002లో విడుదలైన ఈ చిత్రం తారక్ కెరీర్ను మలుపు తిప్పింది. తారక్ ఈ చిత్రంతో స్టార్ హీరోల సరసన నిలిచాడు. ఈ చిత్రం అప్పట్లోనే రూ.20కోట్ల షేర్ను సాధించింది.
‘ఆది’ తర్వాత ‘అల్లరి ప్రియుడు’, ‘నాగ’ సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఆ క్రమంలోనే బాలకృష్ణ కోసం విజయేంద్రప్రసాద్ రాసుకున్న కథతో రాజమౌళి.. ‘సింహాద్రి’ తెరకెక్కించాడు. 2003లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్ళను సాధించింది. ఈ చిత్రంలో తారక్ నటన, డ్యాన్సులకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ‘సింహాద్రి’ తర్వాత పూరి దర్శకత్వంలో తారక్ ‘ఆంధ్రావాలా’ సినిమా చేశాడు. ఈ సినిమా ఆడియో ఫంక్షన్కు ఏకంగా 10లక్షల మంది అభిమానులు వచ్చారు. అప్పటివరకు ఒక ఆడియో ఫంక్షన్కు అంతటి స్థాయిలో జనాలు రావడం అనేది అప్పట్లో పెద్ద చర్చగా మారింది. 2004లో విడుదలైన ఈ చిత్రం భారీ ఫ్లాగ్గా మిగిలింది. ఆ తరువాత వరుసగా ‘నా అల్లుడు’, ‘నరసింహుడు’, ‘ఆశోక్’, ‘సాంబ’, ‘రాఖీ’ వంటి వరుస ప్లాపులుగా నిలిచి తారక్ క్రేజ్ను అమాంతం పడగొట్టేశాయి.
ఆ సమయంలో తారక్ చాలా నిరాశలో ఉన్నాడు. అంతే కాకుండా తారక్ బాడీని చూసి విమర్శలు చేశారు. ఆ విమర్శలు విన్న రాజమౌళి వెంటనే తారక్ను కలిసి మనం యమదొంగ సినిమా చేయబోతున్నాం. దానికి నువ్వు బరువు తగ్గాలి అని సూచించాడట. దాంతో తారక్ కసత్తరులు చేసి ఎవరు ఊహించిన విధంగా సన్నగా మారి అందరు షాక్ అయ్యేలా చేశాడు. 2007లో విడుదలైన ఈ చిత్రం రాజమౌళి-తారక్ల కాంబోలో హ్యట్రిక్గా నిలిచింది. ఈ చిత్రంలో తారక్ పోషించిన యముడు పాత్ర చూసి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఎన్టీఆర్ డైలాగ్స్, డ్యాన్స్ ఇలా సినిమాలో ప్రతీది ప్రేక్షకులకు తెగ నచ్చేశాయి.
ఆ తర్వాత ‘కంత్రి’ ఫ్లాప్ అవ్వగా ‘అదుర్స్’, ‘బృందావనం’ వంటి వరుస బ్లాక్బస్టర్లు ఎన్టీఆర్ క్రేజ్ను మరింత పెంచాయి. ఆ తర్వాత భారీ అంచనాలతో విడుదలైన శక్తి ప్రేక్షకులనే కాదు తారక్ అభిమానులను కూడా తీవ్రంగా నిరశాపరిచాయి. ఈ క్రమంలోనే తారక్ లక్ష్మీ ప్రసన్నను అంగరంగ వైభవంగా పెళ్ళి చేసుకున్నాడు. ఆ తర్వాత మళ్లి తారక్ ఫ్లాపుల బాట పట్టాడు. ‘ఊసరవెల్లి’, ‘దమ్ము’, ‘బాద్షా’, ‘రామయ్యవస్తావయ్యా’, ‘రభస’ వంటి వరుస ఫ్లాప్లు తారక్ను తీవ్రంగా నిరాశపరిచాయి. అంతేకాకుండా అప్పట్లో ఈయన క్రేజ్ కూడా కిందికి పడిపోయింది.
అలాంటి సమయంలో పూరి ‘టెంపర్’ కథతో ఎన్టీఆర్ దగ్గరకు వచ్చాడు. ‘ఆంధ్రావాలా’ వంటి బిగ్గెస్ట్ ఫ్లాప్ తర్వాత మరోసారి వీళ్ళ కాంబోలో సినిమా తెరకెక్కనుండటంతో ప్రేక్షకులతో పాటు అభిమానులు కూడా అసహనం వ్యక్తం చేశారు. ఈ సినిమా కూడా ఫ్లాప్ అవుతుంది అని ఫిక్సయ్యారు. 2015లో విడుదలైన ఈ చిత్రం తారక్కు మంచి కంబ్యాక్ ఇచ్చింది. పోలీస్ ఆఫీసర్గా నెగిటీవ్ రోల్లో తారక్ జీవించేశాడు. ఆ తర్వాత వచ్చిన ‘నాన్నకు ప్రేమతో’, ‘జనతాగ్యారెజ్’, ‘జై లవకుశ’, ‘అరవింద సమేత’ వంటి సినిమాలు వరుసగా విజయాలు సాధించాయి. ముఖ్యంగా చెప్పాలంటే టెంపర్ తర్వాత ఎన్టీఆర్ కథల ఎంపిక పూర్తిగా మారిపోయింది. ఒక దానికి మరోకటి సంబంధం లేకుండా సినిమాలు చేసి వరుస విజయాలను సాధించాడు.
అరవింద తర్వాత మూడున్నరేళ్ళు ‘ఆర్ఆర్ఆర్’ పైనే దృష్టి పెట్టాడు. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది. ఈ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో తారక్ గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభంకానుంది. తారక్ వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా ప్రక్షకులను ఆకట్టుకున్నాడు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’, ‘బిగ్బిస్ వంటి రియాల్టీ షోస్తో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. నటుడిగానే కాదు వ్యాఖ్యాతగా కూడా తనేంటో అని ఈ రెండు రియాలిటీ షోస్తో నిరూపించాడు.