న్యూఢిల్లీ: రామాయణాన్ని చిన్నప్పటి నుంచి విన్నట్టుగానే ఆదిపురుష్ సినిమా ద్వారా చెప్పామని, అందులో మార్పులేమీ చేయలేదని ఆ సినిమా రచయిత మనోజ్ ముంతాషిర్ శుక్లా చెప్పారు. ఆదిపురుష్ సినిమాలో రామాయణాన్ని పూర్తిగా మార్చి చూపించారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. అదిపురుష్ సినిమాలో డైలాగులు, పాత్రల వర్ణన భిన్నంగా ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తడంపై ఆయన స్పందించారు.
హిందూ పురాణ గాథ అయిన రామాయణాన్ని చూపించడంలో తాము ఎక్కడా డీవియేట్ కాలేదని మనోజ్ ముంతాషిర్ శుక్లా చెప్పారు. ‘హనుమంతుడి పాత్రను అందుకు భిన్నంగా ఏమీ చూపించలేదు. శ్రీరాముడి పాత్రను అందుకు భిన్నంగా ఏమీ చూపలేదు. చిన్ననాటి నుంచి వింటున్న కథనే సినిమాలో తీసుకున్నాం. అందులో ఎలాంటి మార్పులు చేయలేదు’ అని ఆయన అన్నారు.
అయితే రామాయణాన్ని పూర్తిగా ఒక మూడు గంటల సినిమాలో చూపించడం సాధ్యం కాదని, అందుకే మిగతా స్టోరీని పూర్తిగా కట్టె.. కొట్టె.. తెచ్చె.. అన్నట్టుగా చూపించి ఆఖరి యుద్ధకాండను వివరంగా చూపించే ప్రయత్నం చేశామని సినిమా డైరెక్టర్ ఓం రౌత్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు.